న్యూఢిల్లీ: 2010వ సంవత్సరం తర్వాత భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి సుమారు 1.90 కోట్ల మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లినట్లు ఓ అధ్యయనం గుర్తించింది. ఏడాదికి సరాసరిన 13.5 లక్షల మంది చొప్పున సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, యూఏఈలకు బతుకుదెరువు కోసం వెళ్లారని ఈ సర్వే తేల్చింది. పశ్చిమాసియా దేశాలకు ప్రధానంగా వలసలు ఎక్కువగా ఉన్నాయి.
అయితే, దక్షిణాసియా, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన వారే ఈ ప్రాంతానికి ఎక్కువగా వలస వెళ్లినట్లు గుర్తించామని సర్వే చేపట్టిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లయిడ్ సిస్టమ్స్ అనాలిసిస్, పాపులేషన్ అండ్ జస్ట్ సొసైటీస్ ప్రోగ్రామ్కు చెందిన గై అబెల్ తెలిపారు. ముఖ్యంగా బంగ్లాదేశీయులు 2010 తర్వాత ఏడాదికి 3 లక్షల మంది చొప్పున సౌదీ వెళ్లినట్లు ఇటీవల జర్నల్ నేచర్లో ప్రచురితమైన ఇందుకు సంబంధించిన కథనం పేర్కొంది. అకస్మాత్తుగా తలెత్తిన సంక్షోభం వంటి పరిస్థితుల వల్ల కాకుండా ఈ వలసలు దీర్ఘకాలంగా కొనసాగుతున్నాయని వివరించింది.


