కొత్తపల్లి(మద్దూరు): రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్ సుధాకర్ అన్నారు. గురువారం మద్దూరు మండలంలోని అప్పిరెడ్డిపల్లి, చెన్వార్, దోరేపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు వివరాలను తెలుసుకోవడంతో పాటు రైతుల సమస్యలపై ఆరా తీశారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని సిబ్బందికి సూచించారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా అవసరమైన టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. డీఏఓ వెంట తహసీల్దార్ మహేశ్గౌడ్, ఏఓ ప్రవీణ్కుమార్ ఉన్నారు.


