ఈ ఏడాది కేసుల నమోదు ఇలా..
నాలుగేళ్లలో నమోదైన కేసులు ఇలా..
జిల్లాలో గుట్టుగా సాగుతున్న పేకాట
● పోలీసుల దాడుల్లో
పట్టుబడుతున్నా మారని తీరు
● నాలుగేళ్లలో 79 కేసులు నమోదు
● రూ. 11,37,539 నగదు స్వాధీనం
–8లో u
నారాయణపేట: సరదాగా మొదలయ్యే జూదం.. కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే వ్యసనంగా మారుతోంది. ‘‘ఒక్క రాత్రిలో రూ.లక్షలు సంపాదిస్తాం’’ అనే ఆశతో పేకాట ఆడుతూ.. చివరకు రూ.లక్షల్లో అప్పులపాలవుతున్నారు. కొందరు యువత ఉద్యోగాలను వదిలి పేకాటకు బానిస కావడం కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోంది. శివారు ప్రాంతాలు, ఫాంహౌస్లు, వ్యవసాయ పొలాల్లో పేకాటరాయుళ్లు రహస్య స్థావరాలను ఏర్పాటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొందరు తమ ఇళ్లను పేకాట క్లబ్లుగా మార్చుకున్నట్లు తెలుస్తోంది.
పట్టుబడినా మారని తీరు..
జిల్లాలో పేకాటరాయుళ్లు పోలీసులకు పట్టుబడి కేసులు నమోదైనా తీరు మారడం లేదు. పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరాలపై ఆకస్మిక దాడులు చేపట్టి.. పేకాటరాయుళ్లపై కేసులు నమోదు చేస్తున్నా పేకాట జోరు మాత్రం తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నాలుగేళ్ల కాలంలో 79 కేసులు నమోదుచేసి.. రూ.11,37,539 నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు 407 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 219 మొబైల్స్, 148 ద్విచక్ర వాహనాలు, 2 ఇతర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ రహస్య ప్రాంతాల్లో మళ్లీ పేకాట శిబిరాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
యువత భవిష్యత్పై ప్రభావం..
ఆన్లైన్ గేమింగ్ పేరుతో పేకాట తరహా బెట్టింగ్ పెరుగుతోంది. చిన్న వయసులోనే డబ్బు సంపాదించాలనే ఆశతో యువత ఈ వలలో పడుతున్నారని సామాజికవేత్తలు హెచ్చరిస్తున్నారు. పోలీసులు అప్పుడప్పుడు దాడులు చేసి.. నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుంటున్నా, రహస్య ప్రాంతాల్లో మళ్లీ ఆటలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటుచేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మార్చి 23న నర్వ పోలీస్స్టేషన్ పరిధిలోని నాగిరెడ్డిపల్లి శివారులో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ఫోర్స్ పోలీసులు, నర్వ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి.. 11 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1,22,900 నగదు, 9 మోటార్ సైకిళ్లు, 11 సెల్ఫోన్లు, పేకాట సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఏప్రిల్ 9న నారాయణపేట రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని బొమ్మన్పాడులో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించి.. ఏడుగురిని పట్టుకున్నారు. వారి నుంచి రూ. 4,330 నగదు, 4 సెల్ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
ఏప్రిల్ 11న కోస్గి బస్టాండ్ సమీపంలోని ఎన్.రాకేశ్ అనే వ్యక్తి నివాసంలో టాస్క్ఫోర్స్, కోస్గి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి.. పేకాట ఆడుతున్న 9మందిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.1,89,800 నగదు, 52 ప్లేయింగ్ కార్డులు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల 15న నర్వ మండలం నాగిరెడ్డిపల్లి శివారులో టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా పేకాట స్థావరంపై దాడులు నిర్వహించి.. రూ. 1,13,200 నగదు, 52 పేకాట కార్డులు, 15 మోటార్ సైకిళ్లు, 18 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని 16 మందిపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు.


