
ఆస్పత్రి తరలింపుపై విచారణ జరపాలి
నారాయణపేట రూరల్: జిల్లా ఆస్పత్రి తరలింపులో భారీ కుంభకోణం ఉందని, వెంటనే విచారణ జరపాలని బీజేపీ సీనియర్ నాయకుడు నాగురావు నామాజీ, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ డిమాండ్ చేశారు. ఆస్పత్రిని పట్టణానికి దూరంగా తరలించడంపై బీజేపీ ఆధ్వర్యంలో 24గంటల నిరాహార దీక్షను శుక్రవారం చేపట్టారు. భారీ ర్యాలీగా సత్యనారాయణ చౌరస్తాకు చేరుకున్నారు. దీక్ష శిబిరంలో నామాజీ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ఆస్పత్రి లేకుండా పూర్తిగా తరలించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. దాదాపు 60 వేల జనాభా ఉన్న జిల్లా కేంద్రంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. జిల్లా కేంద్రానికి 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న మెడికల్ కాలేజీకి ఆస్పత్రిని తరలించడం సరికాదని, రోడ్డు సౌకర్యం, విద్యుద్దీపాలు లేక రోగులు అవస్థలు పడాల్సి వస్తుందని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల సమయంలో కొడంగల్, నారాయణపేట రెండు నియోజకర్గాలు రెండు కళ్లు అని చెప్పి ఇప్పుడేమో కొడంగల్కు విద్యాసంస్థలు, ప్రతి గ్రామానికి రోడ్లు వస్తున్నాయి కానీ నారాయణపేటకు వచ్చిన విద్యా సంస్థలు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాడని ఆరోపించారు. వెంటనే జిల్లా కేంద్రంలో ఏరియా ఆస్పత్రి ఏర్పాటు చేయాలని, ప్రాథమిక ఆరోగ్య చికిత్సలకు, గర్భిణులకు, చిన్న పిల్లలకు వైద్యం ఇక్కడే అందించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు అహ్మదాబాద్ విమానం కూలిన ఘటనలో మృతి చెందిన వారికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో రతన్ పాండు రెడ్డి, శ్రీనివాస్, వెంకట్రాములు, రఘురామయ్య గౌడ్, లక్ష్మీ, వినోద్, జ్యోతి, సాయిబన్న, నందు నామాజీ, కిరణ్ పాల్గొన్నారు.