‘కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి శూన్యం’ | - | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి శూన్యం’

Jun 16 2025 7:23 AM | Updated on Jun 16 2025 7:23 AM

‘కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి శూన్యం’

‘కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి శూన్యం’

నారాయణపేట: కాంగ్రెస్‌ పాలనలో భూ సెటిల్‌మెంట్లు, ఒండ్రు మట్టి, ఇసుక అక్రమ రవాణాపై కమీషన్లు తప్పా అభివృద్ధి శూన్యమని, నియోజకవర్గంలో ఒక్క పని కూడా కొత్తగా చేపట్టలేదని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఆస్పత్రి తరలింపుపై ప్రజలకు సరైన సమాధానం చెప్పలేక ఓ కరపత్రం విడుదల చేసి చేతులు దులుపుకొంటున్నారన్నారు. నారాయణపేటలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు లోపాయికారి ఒప్పందంతో రాజకీయ నాటకాలు మొదలు పెట్టాయని.. రెండు పార్టీలు ఒక్కటేనని విమర్శించారు. అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ఇక్కడి నుంచి తరలివెళ్లినట్లు తెలుస్తోందని.. అదే జరిగితే రైతులు, విద్యార్థులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. జిల్లా ఆసుపత్రి, మెడికల్‌ కళాశాల తీసుకొచ్చింది తానేనంటూ ఎస్‌ఆర్‌ రెడ్డి గట్టిగా చెప్పుకొచ్చారు. పట్టణ పరిసరాల్లో వైద్య, నర్సింగ్‌ కళాశాల, జిల్లా ఆసుపత్రి ఏర్పాటుకు అనువైన భూమి లేకనే అప్పంపల్లి వద్ద ఉన్న స్థలాన్ని ఎంపిక చేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో మంజూరైన ప్రసవ, చిన్న పిల్లల ఆసుపత్రిని పట్టణంలో అందరికీ సౌకర్యంగా ఉండేలా ఏర్పాటు చేయాలని కోరారు. బీఆర్‌ఎస్‌ హయాంలో వివిధ అభివృద్ధి పనులకు మంజూరు చేయించిన నిధులు ఇతర నియోజకవర్గాలకు తరలి వెళ్తుంటే ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అర్‌అండ్‌బీ అతిథిగృహం నిర్మాణానికి రూ.4 కోట్లు వస్తే ఆ నిధులు కొడంగల్‌కు బదిలీ అయ్యాయని, కోయిలకొండ మండలం రామకొండ దేవాలయానికి రూ.10 కోట్లు, జిల్లాకేంద్రంలో సంత్‌ సేవలాల్‌ మహరాజ్‌ భవన్‌ నిర్మాణానికి తీసుకొచ్చిన రూ.కోటి వెనక్కి వెళ్లాయన్నారు. 18 నెలలు గడుస్తున్నా ఎస్పీ కార్యాలయం, స్టేడియం నిర్మాణ పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. భూముల పంచాయితీలు, కబ్జాల్లో కాంగ్రెస్‌ నాయకుల పేర్లు వినిపిస్తున్నాయని.. మట్టి, ఇసుక, ఒండ్రు తవ్వకాల్లో కాంగ్రెస్‌ నాయకులే ఉన్నారని ఇదేనా ప్రజాపాలన అన్నారు. ఎమ్మెల్యే అధిష్టానంతో పోరాటం చేసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తే అందుకు బీఆర్‌ఎస్‌ సహకరిస్తుందని తెలిపారు. సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటుపై స్థానిక బీజేపీ నాయకులు కేంద్రంపై వత్తిడి చేయకపోగా.. బీఆర్‌ఎస్‌పై నిందలు మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సమావేశంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మొసట జ్యోతి, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు అంజలి, మాజీ మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ కన్నా జగదీశ్‌, మాజీ ఎంపీపీలు వెంకట్‌రెడ్డి, నర్సప్ప, నాయకులు సుదర్శన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement