
కార్మిక హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
నారాయణపేట: కార్మికుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నయని, కార్మికులందరూ సంఘటితంగా పోరాడేందుకు సిద్ధం కావాలని హెచ్సీయూ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.హన్మేష్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలో టీయూసీఐ జిల్లా మొదటి మహాసభలు నిర్వహించగా వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొదట కొత్త బస్టాండ్ నుంచి నర్సిరెడ్డి చౌరస్తా, పాత బస్టాండ్, మెయిన్ చౌక్, సరాఫ్ బజార్ మీదుగా ఎస్ఆర్ గార్డెన్ వరకు భారీఎత్తున కార్మిక ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో వారు పాల్గొని మాట్లాడారు. కార్మికుల శ్రమను పాలకుల రూపంలో ఉండే పెట్టుబడిదారులు దోచుకుంటున్నారని.. దేశంలో రూ.వేల కోట్ల సంపద అతికొద్ది మంది చేతుల్లో ఉండగా, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వారికి మద్దతునిస్తోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ రెండూ ప్రజా, కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలేనని దుయ్యబట్టారు. కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లుగా విభజించి కార్మిక సంఘాల అణచివేతకు ప్రయత్నం చేస్తోందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా కార్మికులు అధికంగా ముంబై, హైదరాబాద్, డిల్లీ, బెంగుళూరు వంటి నగరాల్లో భవన నిర్మాణ కార్మికులుగా, ఆటో డ్రైవర్లుగా, ఇతర రంగాల్లో చాలీచాలని వేతనాలకు పని చేస్తున్నారని.. వారి పిల్లల చదువులు, వాళ్ల బతుకులు రోడ్డుపాలు కావడం చూస్తూనే ఉన్నామని తెలిపారు. కార్మికుల హక్కుల రక్షణ, కనీస వేతనాల అమలు, సకాలంలో వేతనాల చెల్లింపులు తదితర సమస్యల పరిష్కారానికి అందరూ ఏకం కావాలని అప్పుడే రాష్ట్రంలో దేశంలో మార్పు వస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రజా, కార్మిక సంఘాల నాయకులు రాము, కాశీనాథ్, కాళేశ్వర్, యాదగిరి, జయలక్ష్మి, రామకృష్ణ, కృష్ణ, నర్సింహ, కంచే నారాయణ తదితరులు పాల్గొన్నారు.