కల్లూరు: హామీలను విస్మరిస్తూ అబద్ధాలతో ప్రజలను ఏమార్చుతూ సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి ఇప్పుడు మొహం చాటేశారన్నారు. అబద్ధాలతో ప్రజలను మభ్య పెట్టి ప్రచారం చేయడంలో సీఎం చంద్రబాబుతో సహా టీడీపీ నాయకులందరూ సిద్ధహస్తులని ఆరోపించారు. సోమవారం కల్లూరు అర్బన్ 34వ వార్డులోని ఓ ఫంక్షన్ హాల్లో విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి కాటసాని రాంభూపాల్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంపై టీడీపీ నాయకులు అబద్ధాలు చెబుతూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారన్నారు. మాజీ సీఎం ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి కూడా తల్లికి వందనం గురించి అబద్ధాలు మాట్లాడం విడ్డూరంగా ఉందన్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు.
లోకేష్ మంత్రి పదవికి
రాజీనామా చేయాలి..
డీఎస్సీ నిర్వహణలో జరిగిన అవకతవకలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాటసాని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో లక్షలాది మంది నిరుద్యోగ యువత, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ సంఘటనపై సీజేపీ, యువత చేసిన నిరసన కార్యక్రమాలు దేశ రాజకీయాలను కుదిపేశాయన్నారు. మెగా డీఎస్సీ నిర్వహణలో జరిగిన అవకతవకలపై కూడా సమగ్ర విచారణ చేయాలని వైఎస్సార్సీపీ మొదటి నుంచి కోరుతుందన్నారు. డీఎస్సీ అభ్యర్థులకు పూర్తిగా న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాలు వెనక్కి తగ్గవని, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున్న ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలతో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. డీఎస్సీ అవకతవలపై ఈ నెల 10వ తేదీన విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ యువతతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించనున్నామన్నారు. సోలార్ ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన రైతుల నుంచి టీడీపీ నాయకులు 50 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులు ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా చెక్కులను బ్యాంకులో వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిమి హనుంతురెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు గాజుల శ్వేతారెడ్డి, కర్నూలు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మీదివేముల ప్రభాకర్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు దండు లక్ష్మీకాంతరెడ్డి, అరుణ, నారాయణరెడ్డి, ఎరుకల వెంకటేశ్వర్లు, సాన శ్రీనివాసులు, నరసింహులు, యువజన విభాగం అధ్యక్షులు వై. శివారెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు మణికంఠరెడ్డి, సాయి, దుర్గ, ప్రవీణ్కుమార్, ఓర్వకల్లు జెడ్పీటీసీ రంగనాథ్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగుల జీవితాలతో
కూటమి ప్రభుత్వం చెలగాటం
మెగా డీఎస్సీ అక్రమాలపై
విచారణ చేపట్టాలి
డీఎస్సీ అభ్యర్థులకు
వైఎస్సార్సీపీ అండ
ఈ నెల 10న విద్యార్థి సంఘాలు,
నిరుద్యోగులతో భారీ ర్యాలీ
పార్టీ నంద్యాల జిల్లా
అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి


