● రోజురోజుకు
పెరుగుతున్న ధరలు
నంద్యాల(న్యూటౌన్): ఉల్లి పాయల ధర రోజు రోజుకు పెరుగుతోంది. గత నెల చివరి వారంలో నాణ్యమైన ఉల్లి కిలో రూ.25 నుంచి రూ.30 వరకు ఉండగా ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ.50కు చేరింది. చిరు వ్యాపారులు ఆటోలపై ఇళ్ల వద్దకు వచ్చి కొంచెం నాసిరకం ఉల్లిపాయలు మూడు కిలోలు రూ.100కు విక్రయిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఉల్లి తీవ్రంగా దెబ్బతినడంతో ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేశారు. ఆ ప్రభావం దిగుమతులపై పడింది. దీంతో డిమాండ్కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉల్లి ధరలు పెరిగిపోతున్నాయి. కర్నూలులో పండించే ఉల్లి ఇంకా అందుబాటులోకి రాకపోవడం కూడా పెరుగుదలకు కారణం. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన హోల్సేల్ మార్కెట్గా డోన్, పత్తికొండ, ఎమ్మిగనూరు, నంద్యాల, కర్నూలు ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడకు కూడా ఉల్లి దిగుమతులు తగ్గాయి.
రోజుకు 500 టన్నులు
ఉమ్మడి జిల్లాలో రోజుకు సగటున సుమారు 500 టన్నుల ఉల్లి వినియోగం జరుగుతుంది. కర్ణాటక, కర్నూలు నుంచి నంద్యాల కేంద్రంగా ఉల్లి దిగుమతులు జరుగుతుంటాయి. అక్కడి నుంచి రోజూ సుమారు 20 లారీల్లో ఉల్లి ఉమ్మడి జిల్లాకు సరఫరా అవుతోంది. ఎగుమతులు జరిగే ఇతర రాష్ట్రాల్లో ఉల్లి దిగుబడి తగ్గడంతో ప్రస్తుతం సుమారు 10 లారీల్లో రోజుకు కేవలం 250 టన్నుల వరకు మాత్రమే దిగుమతి అవుతోంది. కొత్త పంట అందుబాటులోకి వచ్చే వరకు ఉల్లి ధరలు పెరగడమే తప్ప తగ్గడం ఉండదని వ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి ధరల నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు కానరావడం లేదు. ఎగుమతులను నిషేధించడంతో నిల్వలను మార్కెట్లోకి తీసుకువస్తే ధరల నియంత్రణ సాధ్యమవుతుందినే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


