33 మంది మైనర్లకు రూ.1.50 లక్షల జరిమానా
నంద్యాల: నిబంధనలకు విరుద్ధంగా బైక్లు నడిపిన 33 మంది మైనర్లను అదుపులోకి తీసుకుని ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున రూ.1.50 లక్షలు జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ మల్లికార్జునగుప్త ఆదివారం తెలిపారు. మైనర్లు బైక్లు నడపటం నేరమని, వీరి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలో మైనర్ పిల్లల డ్రైవింగ్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు. ఈ మేరకు 33 మందిని పట్టుకుని కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు జరిమానా విధించామన్నారు. జరిమానా విధించడంతో పాటు వారి తల్లిదండ్రులు, సంరక్షకులను స్టేషన్కు పిలిపించి మైనర్లు వాహనాలు నడపటం వల్ల జరిగే ప్రమాదాలపై కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు.
నేడు కలెక్టరేట్లో
ప్రజా వినతుల స్వీకరణ
నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 3న సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam. ap. gov. in వెబ్సైట్లో, టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
క్రీస్తు త్యాగంతోనే పాప విమోచన
నంద్యాల(న్యూటౌన్): ఏసుక్రీస్తు త్యాగం ఫలితంగానే మానవులకు పాప విమోచన లభించిందని నంద్యాల హోలీక్రాస్ క్యాథడ్రల్ పాస్టరేట్–1 డీనరీ చైర్మన్ కొత్తమాసీ జోసఫ్, పాస్టరేట్–2 డీనరీ చైర్మన్ ఎంఐడీ ప్రసాద్, పాస్టరేట్–3 డీనరీ చైర్మన్ సామేల్రత్నరాజ్ గురువులు అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలో పరిశుద్ధ ఆత్మల పండుగను (సమాదుల పండుగను) క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చర్చి ఆవరణలోని సమాదులను సుందరంగా అలంకరించి కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతికిన కాలంలో చిన్న చిన్న తప్పులు చేసి మృతి చెందిన వ్యక్తులు స్వర్గానికి, నరకానికి మధ్యలో ఉండిపోతారని అటువంటి వారి ఆత్మలు దైవ సన్నిధికి చేరడానికి ప్రతి ఏటా నవంబర్ 2వ తేదీన ఆత్మల దినోత్సవం జరుపుతారన్నారు. పాపాలను విడిచి పెట్టి దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తిగా జీవించాలని సూచించారు. అలాగే నంద్యాల డయాసిస్ పరిధిలో సమాదుల పండుగను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాస్టర్లు చంద్రపాల్, విజయకుమార్, జోయల్, పాస్టరేట్–1 గురువులు తదితరులు పాల్గొన్నారు.


