మిర్యాలగూడ : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి భూములిచ్చి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారంతోపాటు ఉద్యోగం ఇస్తామన్న హామీని నిలబెట్టుకుని న్యాయం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం దామరచర్ల మండలంలోని తాళ్లవీరప్పగూడెం, వీర్లపాలెం గ్రామాలకు చెందిన వైటీపీఎస్ భూబాధిత కుటుంబాలు సోమవారం ప్లాంట్ ప్రధాన గేటు ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులకు జూలకంటి రంగారెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడారు. భూబాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్లాంట్ చుట్టు ఉన్న గ్రామాల ప్రజలు, 270 మంది గిరిజన రైతు కుటుంబాలు ఉపాధి అవకాశాలు వస్తాయనే ఆశతో తమ పంట పొలాలను ప్లాంట్కు ఇచ్చారని తెలిపారు. నిర్వాసితుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీని ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. నిర్వాసితులకు న్యాయం చేసేంతవరకు అండగా ఉండి పోరాడుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, వినోద్నాయక్, దయానంద్, పాపానాయక్, జానకిరాంరెడ్డి, భూబాధితులు తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి


