
ప్రభుత్వ విప్ ఐలయ్య ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య
యాదగిరిగుట్ట: ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో పనిచేసే వ్యక్తి గంధమల్ల రవి(30) శుక్రవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం యాదగిరిగుట్ట పట్టణ సీఐ భాస్కర్, మృతుడి భార్య నవిత తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామానికి చెందిన గంధమల్ల రవి తన భార్య నవిత, పిల్లలతో కలిసి యాదగిరిగుట్టలోని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో కొంతకాలంగా పనిచేస్తున్నారు. ఇక్కడకు రాక ముందు రవి సైదాపురం గ్రామంలోనే హోటల్ నిర్వహిస్తుండేవాడు. మద్యానికి బానిసైన రవి గురించి అతడి భార్య నవిత బీర్ల ఐలయ్యకు చెబితే ఆయన తన ఇంట్లోనే సహయకుడిగా పనిచేయాలని, మద్యం తాగడం మానేయాలని సూచించారు. దీంతో యాదగిరిగుట్టలోని ఐలయ్య ఇంట్లో రవి పనిలో చేరి పిల్లలను చదివిస్తున్నాడు.
హోం లోన్ కట్టలేక..
అయితే మూడేళ్ల క్రితం రవి ప్రైవేట్ బ్యాంక్ నుంచి హోమ్ లోన్ తీసుకున్నాడు. ఈఎంఐలు సరిగ్గా కట్టకపోవడంతో బ్యాంక్ అధికారులు రవి ఇంటికి తాళం వేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా సైదాపురం గ్రామంలో సైతం రవి పలువురి వద్ద అప్పులు చేశాడు. అప్పులు ఎక్కువ కావడంతో రవి మళ్లీ మద్యం తాగడం ప్రారంభించాడు. రెండు రోజుల క్రితం రవి ఇంటికి బ్యాంక్ అధికారులు ఈఎంఐ కట్టడం లేదని నోటీసులు అంటించి వెళ్లారు.
ఫోన్ చేస్తే లిఫ్టు చేస్తలేడని..
శుక్రవారం రాత్రి 9గంటలకు రవికి భార్య నవిత ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో రవి తల్లికి నవిత ఫోన్ చేయగా.. రవి సైదాపురం వచ్చి వెంటనే యాదగిరిగుట్టకు వచ్చాడని ఆమె తెలిపింది. దీంతో మరోసారి ఫోన్ చేసినా రవి లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి నవిత బీర్ల ఐలయ్య ఇంటి పైన పెంట్ హౌజ్లోకి వెళ్లి చూడగా.. రవి శాలువాతో ఉరేసుకుని కనిపించాడు. వెంటనే ఆమె గన్మెన్లు, బీర్ల ఐలయ్యకు సమాచారం ఇచ్చింది. వారు వెంటనే రవిని భువనగిరి ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే రవి మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవి భౌతికకాయానికి భువనగిరి ఏరియా ఆస్పత్రిలో బీర్ల ఐలయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. పోస్టుమార్టం అనంతరం రవి మృతదేహాన్ని సొంత గ్రామమైన సైదాపురానికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. రవి అంత్యక్రియలో బీర్ల ఐలయ్య పాల్గొన్నారు.
భార్య ఫిర్యాదుతో కేసు నమోదు..
మద్యానికి బానిస కావడంతో పాటు అప్పుల బాధతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు రవి భార్య నవిత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు యాదరగిరిగుట్ట పట్టణ సీఐ భాస్కర్ తెలిపారు. రవి భార్యతో పాటు కుటుంబ సభ్యులు వాగ్మూలం సైతం నమోదు చేశామని, ఈ కేసును నిష్పక్షపాతంగా విచారణ చేపడుతున్నామన్నారు. ఎవరైనా సోషల్ మీడియాలో నిరాధారమైన ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
నాల్గో అంతస్తులో ఉరేసుకున్న సహాయకుడు
అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి
భార్య ఫిర్యాదు

ప్రభుత్వ విప్ ఐలయ్య ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య