
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు
వలిగొండ : రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన వలిగొండ మండలంలోని అక్కంపెల్లి వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. 108 సిబ్బంది, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన అనిల్ (35) అనే వ్యక్తి ఔటర్ రింగ్ రోడ్డులో టోల్గేటు వద్ద విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా పని ముగించుకుని రామన్నపేట మండలంలోని పల్లివాడలో బంధువుల ఇంటికి తన మోటారు సైకిల్పై వెళ్తుండగా రోడ్డుపై ఉన్న గుంతలో పడి మోటారు సైకిల్ అదుపుతప్పి అనిల్ కిందపడిపోయారు. అంతలో వెనుక నుంచి వస్తున్న లారీ అనిల్ కాలి పైనుంచి వెళ్లడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అనిల్ను వెంటనే చికిత్స నిమిత్తం 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
గీత కార్మికుడికి తీవ్ర గాయాలు
నకిరేకల్ : తాటిచెట్టు ఎక్కుతున్న క్రమంలో అకస్మాత్తుగా చెట్టు కూలిపోవడంతో ఓ గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. వివరాలు.. చందుపట్లకు చెందిన కొప్పు పెద్ద శ్రీను(44) గీత కార్మికుడు రోజువారీ మాదిరిగా తాటి చెట్టు ఎక్కేందుకు వెళ్లాడు. చెట్టు ఎక్కుతున్న క్రమంలో గాలి రావడంతో అది కూలిపోయి కిందపడి గాయపడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనును కుటుంబ సభ్యులు నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
రెండు ట్రాక్టర్లు ఢీకొని డ్రైవర్కు..
వేములపల్లి: రెండు ట్రాక్టర్లు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం వేములపల్లి మండలంలోని మొల్కపట్నం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రావులపెంట గ్రామం నుంచి మిర్యాలగూడ వైపు ఇసుక లోడ్తో అతివేగంగా వెళ్తున్న ట్రాక్టర్.. కారును తప్పించబోయి మిర్యాలగూడ నుంచి రావులపెంట వైపు ఇసుకను అన్లోడ్ చేసి వెళ్తున్న మరో ట్రాక్టర్ను మొల్కపట్నం గ్రామ శివారు వద్ద ఢీకొట్టింది. దీంతో ఇసుక లోడ్తో ఉన్న ట్రాక్టర్ పల్టీ కొట్టడంతో ట్రాక్టర్ డ్రైవర్ చంటికి తీవ్ర గాయాలయ్యాయి. మరొక ట్రాక్టర్ డ్రైవర్ తృటిలో తప్పించుకున్నాడు. రెండు ట్రాక్టర్లు రావులపెంట గ్రామానికి చెందినవే. స్థానికులు 108 వాహనం సహాయంతో తీవ్ర గాయాలపాలైన చంటిని మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గంటకు పైగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.