
విద్యార్థులను క్రమం తప్పకుండా తీసుకురావాలి
గుర్రంపోడు : తల్లిదండ్రులు విద్యార్థులను క్రమంతప్పకుండా భవిత కేంద్రానికి తీసుకురావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గుర్రంపోడు మండల కేంద్రంలో భవిత విద్యావనరుల కేంద్రాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగ విద్యార్థులతో ముచ్చటించారు. ఒక్కో విద్యార్థి పేరు అడిగి తెలుసుకున్నారు. భవిత కేంద్రానికి కలెక్టర్ రెండు పెంపుడు కుక్కలను తెప్పించారు. పిల్లలు వాటితో ఆడుకుంటూ ఉత్సాహంగా ఉండటాన్ని గమనించారు. కుక్కకు పేరు ఏమి పెడతారని పిల్లలను ప్రశ్నించగా.. వారు మ్యాంగో అని పెడతామని పేర్కొన్నారు. కేంద్రానికి ఇంకా ఏమేం కావాలో ఐఈఆర్పీ శారదను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మోడల్ స్కూల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేశారు. కేజీబీవీలో వంట గదులు, వసతులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట ఎంపీడీఓ మంజుల, ఎంఈఓ నోముల యాదగిరి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాగిణి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ విజయశ్రీ, ఏఈ రవికుమార్ తదితరులున్నారు.
ఫకలెక్టర్ ఇలా త్రిపాఠి