
నల్లగొండకేవీ నిధులు!
సాగర్ ఎడమకాల్వ మరమ్మతును పట్టించుకోని ప్రభుత్వం
మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమకాల్వ ద్వారా 10.39 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ కాల్వ పరిధిలో నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, ఏపీలోని కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాలు ఉన్నాయి. నాగార్జునసాగర్ 0 కి.మీ నుంచి ఎడమకాల్వ పొడవు 179 కి.మీ వరకు విస్తరించి ఉంది. ఈ కాల్వపైన మేజర్లు, మైనర్లు ద్వారా పొలాలకు నీరందుతుంది. లక్షల ఎకరాలకు నీరందించే ఈ కాల్వ మరమ్మతుల విషయంలో ప్రభుత్వం వివక్ష చూపుతోంది. సూర్యాపేట జిల్లాకు చెందిన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వారి సొంత జిల్లాల పరిధిలో ఎడమకాల్వ మరమ్మతులకు నిధులు విడుదల చేయించుకున్నారు. కానీ.. అసలు కాల్వ మొదటి భాగం అయిన నల్లగొండ జిల్లా పరిధిలో మరమ్మతులకు మాత్రం నిధులు ఇవ్వలేదు. దీంతో నల్లగొండ జిల్లా పరిధిలో మెయిన్ కెనాల్తోపాటు మేజర్లు, మైనర్లు ఆనవాలు కోల్పోయే పరిస్థితి దాపురించింది.
చివరి భూములకు అందని నీరు
సాగర్ ఎడమకాల్వకు గతంలో చేపట్టిన ఆధునీకరణలో భాగంగా ఇరువైపులా 90శాతం మేర సీసీ లైనింగ్ చేశారు. కొన్నిచోట్ల వదిలేశారు. ఎడమకాల్వకు 14వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉంది. కానీ, కట్టలు బలహీనంగా ఉండడంతో 11వేల క్యూసెక్కుల లోపు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ ఎడమకాల్వ కింద మేజర్లు, మైనర్ల పరిధిలో కూడా ఇదే పరిస్థితి ఉంది. నల్లగొండ జిల్లా పరిధిలో ప్రధానంగా వజీరాబాద్, కిష్టాపురం, ముల్కలకాల్వ మేజర్ పరిధిలో కాల్వ కట్టలు బలహీనంగా ఉన్నాయి. సీసీ లైనింగ్ ఏర్పాటు చేయకపోవడంతో నీటి విడుదల కారణంగా కోతకు గురవుతున్నాయి. కాల్వకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయడంలేదు. దీంతో చివరి భూములకు ప్రతి సీజన్లో నీరందకుండా పోతోంది. ఈ సీజన్లో కూడా అదే పరిస్థితి దాపురించింది.
సూర్యాపేట, ఖమ్మం జిల్లాల పరిధిలో నిధులు..
● ఎడమకాల్వ పరిధిలోని నల్లగొండ మినహా సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో ఉన్న కాల్వల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. సూర్యాపేట జిల్లాలో కాల్వల అత్యవసర మరమ్మతుల కోసం రూ.1.26కోట్ల నిధులు కేటాయించారు. కాల్వలో ఇరువైపులా ఉన్న కంపచెట్లు తొలగించి లైనింగ్ ఏర్పాటు చేసి దెబ్బతిన్న తూములకు, షట్టర్లకు మరమ్మతులు చేస్తున్నారు. పెన్పహాడ్ మండలం దోసపాడు వద్ద కాల్వ 74కి.మీ నుంచి నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం రంగుల వంతెన 133కి.మీ వరకు మరమ్మతు పనులు చేస్తున్నారు. ఆ పరిధిలోని 24 మేజర్ కాల్వలు, తూములకు పాత షట్టర్లను తొలగించి కొత్త షట్టర్లను ఏర్పాటు చేస్తున్నారు.
● ఖమ్మం జిల్లాలో ఎడమకాల్వలో ముళ్ల కంప తొలగింపునకు నిధులు మంజూరయ్యాయి. వైరా, పాలేరు, లంకసాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన కాల్వలకు శాశ్వత మరమ్మతులు చేపడుతున్నారు. క్రాస్ రెగ్యులేటర్ షట్టర్ల మరమ్మతుకు టెండర్లు పూర్తి చేశారు. ఖమ్మం, కల్లూరు సర్కిల్లో 15 ఎత్తిపోతల మరమ్మతులకు 1.50కోట్లు మంజూరయ్యాయి. పాలేరు ప్రధాన కాల్వపై కొట్టుకపోయిన్ అండర్ టన్నెల్ మరమ్మతులకు రూ.14కోట్లు కేటాయించారు.
ఫ ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకే నిధులు కేటాయింపు..
ఫ నల్లగొండలో ఆనవాలు కోల్పోతున్న మెయిన్ కెనాల్, మేజర్, మైనర్ కాల్వలు
ఫ సాగునీటి విడుదలపై ప్రభావం
ప్రభుత్వానికి ప్రతిపాదించాం
నల్లగొండ జిల్లా పరిధిలో ఎడమకాల్వ, మేజర్లు, మైనర్ల కట్టలకు మరమ్మతులు చేసేందుకు ఎస్టిమేట్లు వేసి ప్రభుత్వానికి ప్రతిపాదించాం. నిధులు మంజూరు కాకపోవడంతో ఈ వేసవిలో పనులు చేపట్టలేకపోయాం. నిధులు మంజూరైతే వెంటనే పనులు ప్రారంభిస్తాం. సూర్యాపేట, ఖమ్మం జిల్లాల పరిధిలో నిధులు మంజూరయ్యాయన్న విషయం మా దృష్టికి రాలేదు. సాగునీరు వృథా కాకుండా, చివరి భూములకు నీరందే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం.
– అజయ్కుమార్, ఎన్ఎస్పీ, సీఈ
పొంచి ఉన్న ముప్పు
ఇటీవల మిర్యాలగూడలో ఉమ్మడి జిల్లా నీటి పారుదలపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమీక్షించారు. ఎడమకాల్వ మరమ్మతులకు నిధులు కేటాయిస్తామని పేర్కొన్నప్పటికీ ఇప్పటివరకు ఆ జాడ చేయలేదు. త్వరలోనే సాగర్కు వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉండగా వానాకాలం సీజన్ పంటలు సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సాగునీటిని విడుదల చేస్తే ఎడమకాల్వ పరిధిలోని కాల్వకట్టలకు ఎక్కడ, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

నల్లగొండకేవీ నిధులు!