
వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
మిర్యాలగూడ టౌన్ : భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని వేధిస్తుండడంతో.. మనస్తాపానికి గురైన వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని జంకుతండాకు చెందిన బుడిగపాక నరేష్, శోభ దంపతుల కుమార్తె దివ్య(23) మిర్యాలగూడ పట్టణంలోని ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తుండగా.. యాద్గార్పల్లి గ్రామానికి చెందిన బొంత నాగరాజు, లక్ష్మి దంపతుల కుమారుడు బొంత వెంకటేష్తో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం ప్రేమగా మారడంతో ఇరువురు వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె లాస్య, కుమారుడు తరుణ్కుమార్ ఉన్నారు. అయితే గత రెండేళ్లుగా యాద్గార్పల్లి గ్రామానికే చెందిన మహిళతో వెంకటేష్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసి దివ్య భర్తను నిలదీసింది. దీంతో ‘నీవు కట్నం ఏమైనా తెచ్చావా.. నీవు తక్కువ కులం దానివి’ అంటూ దివ్యను కొంతకాలంగా వెంకటేష్ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇదే విషయమై సోమవారం భార్యాభర్తల మధ్య మరో సారి గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన దివ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపారు.