
అధ్యక్ష పాలన దిశగా బీజేపీ ప్రయత్నాలు
యాదగిరిగుట్ట: అమెరికా తరహాలో మన దేశంలోనూ అధ్యక్ష పాలన దిశగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం. సాయిబాబా అన్నారు. సోమవారం యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహ ఫంక్షన్హాల్లో ప్రారంభమైన సీపీఎం జిల్లా రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. భారతదేశానికి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. బీజేపీ విధానాలను తిప్పి కొట్టాలని అన్నారు. దేశంలో ఇప్పటివరకు 14 మంది ప్రధాన మంత్రులు రూ.50లక్షల కోట్ల అప్పు చేస్తే నరేంద్ర మోదీ ఒక్కరే రూ.170 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. మన దేశం ఆకలి సూచీలో ప్రపంచంలోనే 104 స్థానంలో ఉందని, దీనిని అభివృద్ధి అనాలి అని ప్రశ్నించారు. మోదీ ప్రధాని కాక ముందు దేశంలో 100 మంది కోటీశ్వరులు ఉంటే ఇప్పుడు 200మంది అయ్యారని దుయ్యబట్టారు. మోదీ పేదల సంక్షేమంపై దృష్టి పెట్టలేదన్నారు. భద్రతా లోపం వల్లే పహల్గాంలో ఉగ్రదవాదుల దాడిలో 21 మంది అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్నారు. మహిళలపై దాడులు జరుగుతున్నా కేంద్రం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. శిక్షణ తరగతులకు ముందు పార్టీ మండల కార్యదర్శి బబ్బూరి పోశెట్టి పార్టీ జెండాను ఎగురవేశారు. పట్టణ కార్యదర్శి నూకల భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎండీ. జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జెల్లెల పెంటయ్య, బూరుగు కృష్ణారెడ్డి, గుంటోజు శ్రీనివాసచారి పాల్గొన్నారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు
సాయిబాబా