ప్రమాదపుటంచున పర్యాటకులు | - | Sakshi
Sakshi News home page

ప్రమాదపుటంచున పర్యాటకులు

Aug 3 2026 1:01 AM | Updated on Aug 3 2026 1:01 AM

పోలీసుల పహారా అవసరం..

జూరాలకు వరద వస్తుండటంతో క్రస్ట్‌ గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదలుతున్నారు. ఈ సమయంలో పోలీసుల పహార లేక పర్యాటకులు దిగువ నది వద్ద పరవళ్లను చూసేందుకు దిగువ నదిలోకి వెళ్తున్నారు. ఉధృతంగా పారుతున్న నీటితో ఆడుకుంటున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున పోలీసులు రక్షణ చర్యలు చేపట్టాలి. – వెంకటేష్‌, నందిమళ్ల

భద్రత చర్యలు చేపడతాం..

జూరాల ప్రాజెక్టు వద్ద వరద ఎక్కువగా ఉండటంతో భద్రత చర్యలు తీసుకుంటున్నాం. ఆదివారం అధికసంఖ్యలో పర్యాటకులు రావడంతో దిగువ పుష్కరఘాట్‌ రోడ్‌ను మూసివేసి నదిలోకి వెళ్లకుండా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాం. సూచిక బోర్డుల ఏర్పాటుతో పాటు ప్రాజెక్టుపై వాహనాలు నిలుపకుండా తగిన చర్యలు చేపడుతున్నాం.

– శివకుమార్‌, సీఐ, ఆత్మకూర్‌

అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ నుంచి వరద భారీగా వస్తుండటంతో క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ సమయంలో కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులతో ప్రాజెక్టు దిగువ భాగం కళకళలాడుతున్నా.. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనన్న భయాందోళనలు నెలకొంటున్నాయి. క్రస్ట్‌ గేట్ల నుంచి నురగలు కక్కుతూ దిగువకు పారుతున్న నీటి దృశ్యాలను చూసేందుకు, నది అంచునకు వెళ్లి సెల్‌ఫోన్లలో సెల్ఫీలు తీసుకోవడం, స్నానాలు చేస్తూ కేరింతలు కొడుతుండటంతో ప్రమాదం ఏ రూపంలో వస్తుందో ఉహించలేని పరిస్థితి నెలకొంది. నిత్యం పోలీసు పహార ఉండాల్సిన అవసరం ఉన్నా.. కేవలం నామమాత్రపు గస్తీ నిర్వహిస్తూ వెళ్తుండటంతో పర్యాటకులు నది అంచున వరకు వెళ్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు 32 గేట్లను ఎత్తి దిగువకు సుమారు 1.80 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలానికి వదులుతున్నారు. కృష్ణమ్మ ఉగ్రరూపంలో దిగువన ప్రవహిస్తుండటంతో పరీవాహక ప్రదేశాల్లోకి ఎవరూ వెళ్లకుండా నియంత్రించేందుకు ముళ్లకంచె ఏర్పాటు చేయాల్సిన అధికారులు.. ఇప్పటి వరకు అలాంటి చర్యలు చేపట్టకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం ప్రాజెక్టు పైభాగం నుంచే పర్యాటకులను తిలకించేలా పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఎడమ కాల్వ వద్ద మరీ డెంజర్‌..

జూరాల ఎడమ కాల్వ వద్ద నీటి ప్రవాహం ఉధృతిని గుర్తించలేని యువత ఈతకు వెళ్లి గల్లంతైన ఘటనలు ఉన్నాయి. అలాగే ఇక్కడ దొరికే చేప ఫ్రైని తిని ఆస్వాదించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచేగాక కర్ణాటక రాయచూర్‌ నుంచి కూడా పర్యాటకులు భా రీగా వస్తుంటారు. చేప వంటకాలతో పాటు మద్యం అమ్ముతుండటంతో తాగిన మైకంలో యువకులు కాల్వలో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు.

గతంలో చోటు చేసుకున్న ఘటనలు..

రెండేళ్ల కిందట మహబూబ్‌నగర్‌కు చెందిన ఐస్‌క్రీం విక్రయదారు జూరాల సందర్శనకు వచ్చి నదిలో స్నానం చేస్తూ గల్లంతై ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అదే ఏడాది మహబూబ్‌నగర్‌కు చెందిన ముస్లిం యువకుడు సైతం కుటుంబ సభ్యుల కళ్లముందే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందిస్తున్నారే తప్ప వరద వస్తుందని తెలిసిన మరుక్షణమే దిగువ నదిలోకి పర్యాటకులు వెళ్లకుండా రక్షణ కంచె ఏర్పాటు చేయడం లేదు.

జూరాల వద్ద పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

చూసేందుకు తరలివస్తున్న జనం

దిగువ నదిలో సెల్ఫీ ఫోజులు

అదుపుతప్పితే ప్రవాహంలో గల్లంతయ్యే ప్రమాదం

సూచిక బోర్డులు ఏర్పాటుచేయని ప్రాజెక్టు అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement