● శిశువు ఎదుగుదలలో వీటి పాత్రే కీలకం
● డబ్బా పాలతో అనారోగ్య
సమస్యలు వచ్చే ప్రమాదం
● జిల్లాలో తల్లిపాల
వారోత్సవాలకు శ్రీకారం
● గర్భిణులు, బాలింతలకు
అవగాహన కార్యక్రమాలు
అమ్మపాలు శిశువుకు అమృతం వంటివి. శిశువు ఆరోగ్యంగా జీవించాలంటే ముర్రుపాలు పట్టించాలి. డబ్బా పాలు తాగిస్తే కలిగే దుష్ప్రయోజనాలపై అంగన్వాడీ టీచర్లు గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వ లక్ష్యాలు, అందిస్తున్న పథకాలను వివరించాల్సి ఉంది. తల్లిపాలలోని పోషకాలు, తల్లీబిడ్డలకు కలిగే ప్రయోజనాలపై వైద్య సిబ్బందితో అవగాహన కల్పించాలి.
– జరీనాబేగం, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి
మహబూబ్నగర్ రూరల్: తల్లీబిడ్డల మధ్య ఆత్మీయతను పెంచేవి తల్లిపాలు. బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని.. పోషక పదార్థాలను అందిస్తాయి. బిడ్డ పుట్టిన తల్లి ప్రతిరోజు లీటరు పాలు అదనంగా తాగితే నవజాత శిశువుకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించవచ్చు. కానీ, ఇటీవల పాల డబ్బాలు పిల్లల ఆరోగ్యాన్ని, తల్లి ఆప్యాయతను దూరం చేస్తున్నాయి. బిడ్డకు సుమారు రెండేళ్లపాటు పాలు ఇవ్వాల్సి ఉండగా.. ఎక్కువ మంది తల్లులు కేవలం ఏడాది మాత్రమే ఇస్తున్నారని వైద్య, ఆరోగ్యశాఖ అధ్యయనంలోనూ తేలింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు నెల మొదటి వారంలో తల్లిపాల విశిష్టతను తెలియజేసేలా.. 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. తల్లిపాల సంస్కృతిని రక్షించడానికి తగిన ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఏటా వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందు లో భాగంగా తల్లిపాల విశిష్టతను గర్భిణులు, బా లింతలకు వివరించేందుకు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులు శనివారం నుంచి వారం రోజులపాటు తల్లిపాల వారోత్సవాలకు శ్రీకారం చుట్టింది.
పోత పాలతో ముప్పు
పోతపాలు, పాల పౌడర్ కల్తీ అయ్యే అవకాశం ఉన్నందున పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కొందరు మహిళలు అందం, శరీర ఆకృతి చెదిరిపోతుందనే ఉద్దేశంతో బిడ్డకు పాలివ్వడం లేదు. వీరిలో ప్రధానంగా సంపన్న వర్గానికి చెందినవారే ఎక్కువ ఉన్న ట్లు అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మరికొందరు ఒక్కసారి బిడ్డకు ఇవ్వడానికి ప్రయత్నించి తర్వాత పాలు రావడం లేదని వదిలేస్తారు. వైద్యుల సలహా తీసుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మెడిసిన్ ద్వారా 30 శాతం మాత్రమే ఫలితం వచ్చే అవకాశం ఉంది. డబ్బాపాలు తాగిస్తే బిడ్డ కడుపు నిండుతుందే కానీ పోషకాలు అందవు.
ముర్రుపాలు ఎంతో శ్రేష్టం..
ప్రసవించిన తర్వాత తల్లి బిడ్డకు ఇచ్చే ముర్రుపాలు అమృతం లాంటివి. బిడ్డకు ఆ పాలు యాంటీ బయోటిక్స్లా ఉపయోగపడతాయి. మూడు రోజులపాటు పసుపురంగులో వచ్చే ఈ పాలలో బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు ఉంటాయి. పుట్టిన ప్రతి బిడ్డకు వచ్చే కామెర్లు.. ఈ పాలు తాగిస్తే 90 శాతం తగ్గుతాయి. తల్లిపాలతో పిల్లల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో మేధోసంపత్తి పెరిగే అవకాశం ఉంది. రెండేళ్ల వరకు అదనపు ఆహారంతోపాటు తల్లిపాలు పట్టాలి. తల్లిపాలతో బిడ్డ పేగులో నుంచి విసర్జకాలు తొలగిపోతాయి. ఎలర్జీలు రావు. దీర్ఘకాల వ్యాధులు ఉన్న తల్లులు వైద్యుల సలహా మేరకు శిశువులకు పాలివ్వాలి.


