తిమ్మాజిపేట: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివశంకర్ తెలిపారు. ఆదివారం తిమ్మాజిపేటలో పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. నిత్యావసరాల ధరలను నియంత్రించాలని, సార్వత్రిక విద్య, మెరుగైన వైద్యం అందుబాటులోకి తేవాలని, దళిత, ఆదివాసీలపై దాడులను అరికట్టాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, కార్మికుల హక్కులను పరిరక్షించాలని తదితర డిమాండ్లతో ఈ నెల 6 నుంచి 14వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఖాజామైనొద్దీన్, శ్రీనివాసులు, కృష్ణయ్య, మాసయ్య, దేవేందర్, అశోక్ పాల్గొన్నారు.
11 యూనిట్లలో విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక నుంచి వరదనీరు భారీగా చేరుతుండడంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. ఈ మేరకు ఆదివారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 5 యూనిట్ల ద్వారా 200 మెగావాట్లు చేపట్టారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 37.781 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి విజయవంతంగా చేపట్టామన్నారు. ప్రస్తుతం 33 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ శ్రీశైలానికి వదులుతున్నామని చెప్పారు.
అన్నవరం క్షేత్రానికిప్రత్యేక బస్సు
కొల్లాపూర్: స్థానిక ఆర్టీసీ డిపో నుంచి అన్నవరం క్షేత్రానికి ఈ నెల 8న ప్రత్యేక బస్సు ఏర్పాటుచేసినట్లు డిపో మేనేజర్ మల్లేశయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొల్లాపూర్ నుంచి సాయంత్రం 6 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరి.. భద్రాచలం, విజయవాడ, అన్నవరం, వైజాగ్, సింహాచలం చేరుకుంటుందని పేర్కొన్నారు. 11న సాయంత్రం తిరిగి కొల్లాపూర్ చేరుకుంటుందని ఆయన వివరించారు. బస్సులో రానుపోను ప్రయాణ చార్జీలు నాలుగు రోజులకు పెద్దలకు రూ. 3వేలు, పిల్లలకు రూ. 2వేలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. భక్తులు టికెట్ల బుకింగ్ కోసం స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో సంప్రదించాలని సూచించారు.


