● జాతీయ లోక్అదాలత్ను కక్షిదారులు
సద్వినియోగం చేసుకోవాలి
● జిల్లా జడ్జి రమాకాంత్
నాగర్కర్నూల్ క్రైం: చిన్నచిన్న కేసుల పరిష్కారానికి రాజీ మార్గమే ఉత్తమమని.. ఈ నెల 28న నిర్వహించే జాతీయ లోక్అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్కు సంబంధించిన పోస్టర్ను న్యాయమూర్తి ఆవిష్కరించి మాట్లాడారు. 28న జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో నిర్వహించే జాతీయ లోక్అదాలత్లో భూతగాదా కేసులు, రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులు, చెక్బౌన్స్, కుటుంబ కేసులు, మోటారు వాహనాల కేసులు, బ్యాంకు కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. లోక్అదాలత్ ద్వారా కేసుల సత్వర పరిష్కారంతో పాటు అప్పీల్ లేని తీర్పు పొందవచ్చన్నారు. తద్వారా ఇరువర్గాలకు న్యాయం చేకూరడంతో పాటు సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చని అన్నారు. పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి నసీం సుల్తానా మాట్లాడుతూ.. కక్షిదారులు పగలు ప్రతీకారాలతో కాకుండా, రాజీ మార్గంతో మానవ సంబంధాలను బలపర్చుకోవాలని సూచించారు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా కేసులను పరిష్కరించుకునేందుకు లోక్అదాలత్ గొప్ప అవకాశమని.. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.


