● మహిళా సర్పంచులు నాయకత్వ పటిమ పెంపొందించుకోవాలి
● కలెక్టర్ బదావత్ సంతోష్
కందనూలు: గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కొల్లాపూర్ డివిజన్లోని 72 గ్రామాల సర్పంచులకు మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన నాలుగో విడత శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అభివృద్ధి కార్యక్రమాల్లో సర్పంచులు ముందుండి నాయకత్వం వహించాలని.. గ్రామ ప్రతిష్టను పెంచే విధంగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారా తమ వ్యక్తిగత గౌరవాన్ని కూడా పెంపొందించుకోవచ్చని అన్నారు. ఎలాంటి రాజకీయాలకు తావివ్వకుండా పేదల అభ్యున్నతికి పాటుపడేలా పరిపాలన ఉండాలన్నారు. మహిళా సర్పంచుల స్థానాల్లో కుటుంబ సభ్యుల జోక్యం కల్పించకుండా.. మహిళా సర్పంచులు తమ నాయకత్వ పటిమను పెంపొందించుకోవాలన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ.. లోటుపాట్లు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు.
● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ మాట్లాడుతూ.. సర్పంచులు ప్రజలతో మమేకమై పారదర్శకంగా పాలన సాగించాలన్నారు. పన్నులు, ఇతర స్థానిక వనరుల ద్వారా సమకూరే ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. తద్వారా ప్రజోపయోగ పనులు చేపట్టి.. మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, డీపీఓ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.


