కాశిబుగ్గ: చేనేత వస్త్రాలను టెండర్ ద్వారా కాకుండా టెస్కో ద్వారానే ఖరీదు చేయడానికి కృషి చేస్తానని రాష్ట్ర జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు హామీ ఇచ్చారు. ఆదివారం కొత్తవాడకు చెందిన చేనేత సొసైటీ ప్రతినిధుల బృందం మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆధ్వర్యంలో మంత్రి తుమ్మలను కలిసి చేనేత సమస్యలు విన్నవించారు. గతంలో మాదిరిగానే బెడ్ షీట్లు, కార్పెట్లు ప్రభుత్వరంగ సంస్థ అయిన టెస్కో ద్వారానే కొనాలని, చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈసందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. చేనేత పరిశ్రమకు సంబంధించిన బెడ్ షీట్లు, కార్పెట్లు, ఇతర వాటిని టెండర్ ద్వారా కాకుండా, నేరుగా సొసైటీల నుంచి కొనేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై నేత కార్మికులు అధైర్యపడకూడదని, కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈవిషయాన్ని సీఎం దృష్టికి తీసుకవస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు గుండేటి నరేంద్రకుమార్, డాక్టర్ ఆడెపు రవీందర్, వడ్నాల నరేందర్, గోరంటల రాజు, ఎలగం భద్రయ్య, మెరుగు చిన్న భద్రయ్య, పంతగాని శ్రీనివాస్, కొలిపాక మదనయ్య, ఝెలగం సాంబయ్య, అడిగొప్పుల సంపత్, ఆడెపు రవి తదితరులు పాల్గొన్నారు.


