ములుగు: నాణ్యమైన ఆహారం తీసుకోవడం ద్వారానే మెరుగైన జీవనం సాధ్యమవుతుందని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద సోమవారం ‘ఈట్ రైట్ వాక్’ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాలను చేపడుతుందన్నారు. ఇందులో భాగంగా సోమవారం నుంచి 11వ తేదీ వరకు ఆరోగ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి రోజు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీని నిర్వహించినట్లు తెలిపారు. తీసుకునే ఆహారం ఆరోగ్యంపై దాదాపు 90 శాతం ప్రభావం చూపుతుందన్నారు. మంచి ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుందని వెల్లడించారు. తినుబండారాలు, భోజనశాలలు, అల్పాహార కేంద్రాల నిర్వాహకులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, డీఎంహెచ్ఓ గోపాల్రావు, డీపీఓ వెంకయ్య, డీసీహెచ్ జగదీశ్వర్ పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర


