'నా వల్ల కావడం లేదు.. నా తప్పుంటే జైలుకైనా వెళ్తా'.. సింగర్ మంగ్లీ ఆవేదన | Singer Mangli Meet DGP for Complaint on Fradusters | Sakshi
Sakshi News home page

Singer Mangli: 'సోషల్ మీడియాలో కామెంట్స్.. చాలా బాధగా ఉంది'

Apr 15 2026 8:07 PM | Updated on Apr 15 2026 8:30 PM

Singer Mangli Meet DGP for Complaint on Fradusters

తనపై వస్తున్న ఆరోపణలపై టాలీవుడ్ సింగర్ మంగ్లీ మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తనకు ఎలాంటి వ్యాపారాలు లేవు.. పాటే నా ప్రాణమని చెప్పిన మంగ్లీ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈ వివాదంపై సీపీ సజ్జనార్‌ను కలిపి ఫిర్యాదు చేసిన మంగ్లీ.. తన లాయర్‌తో డీజీపీని కలిశారు.  ఈ సందర్భంగా ఆమె మీడియా మాట్లాడారు. ఈ వివాదంతో 30 రోజులుగా నా ప్రోగ్రామ్స్‌ అన్నీ వదులుకోవాల్సి వచ్చిందని తెలిపింది. దయచేసి చెబుతున్నా.. నా తప్పు ఉంటే ఎలాంటి శిక్షకైనా నేను సిద్ధమని ప్రకటించింది. సోషల్ మీడియాలో వచ్చే వాటిని ఎవరు నమ్మకండని విజ్ఞప్తి చేసింది. సోషల్‌మీడియాలో పెట్టే పోస్టులు చూస్తుంటే చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేసిన వారందరిపైనా కేసులు పెట్టానని మంగ్లీ తెలిపింది. డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

మంగ్లీ మాట్లాడుతూ..'నాకు పాటల ప్రపంచ తప్ప మరేది తెలియదు.  సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మకండి. కొందరి కామెంట్లు చూసి లోలోపల కుమిలిపోతున్నా. ఇక నా వల్ల కావటం లేదు. నేను తప్పు చేస్తే, విచారణకు సిద్ధం.  ఆరోపణలు నిజమైతే జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమే. బాధితుడి ఆవేదన చూస్తుంటే నాకూ బాధగా ఉంది. నేను కూడా పేదరికం నుంచే వచ్చా. ఆ బాధేంటో నాకు తెలుసు. నాపై కోపం ఉంటే వచ్చి మాట్లాడండి. ప్రజలకు నన్ను దూరం చేస్తున్నారు. తెలిసి, తెలియక తప్పు మాట్లాడితే క్షమించండి. సంబంధం లేని విషయాల్లో నా ఫొటోలు దయచేసి వాడకండి. బాధితులకు నేను అండగా ఉంటా. నా దుష్ప్రచారం చేసిన వారిని కూడా కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నా. మధు నాయక్, హిమకాంత్ రెడ్డి, రమావత్ మధు, సిద్ధు, సుబ్బారావులపై డీజీపీకి ఫిర్యాదు చేశా' అని అన్నారు. 

అసలేం జరిగిందంటే..

సింగర్ మంగ్లీ మైక్రో ఫైనాన్స్ పేరిట రూ.10 కోట్ల మోసానికి పాల్పడ్డారని సుబ్బారావు అనే న్యాయవాది ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంగ్లీతో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మంగ్లీ కూడా పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసత్య ప్రచారం చేస్తోన్న సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.
 

Advertisement
 
Advertisement
Advertisement