స్టార్ హీరో సూర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది కరుప్పు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో త్రిష కథానాయిక. ఈ చిత్రం తెలుగులో వీరభద్రుడు పేరిట విడుదలైంది. ఇక ఈ సినిమా కోసం తొలుత హీరో విజయ్ను అనుకున్నానని డైరెక్టర్ గతంలోనే చెప్పాడు. 2021లోనే విజయ్ను కలిసి కథ చెప్పగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు వీలైతే వెంటనే షూటింగ్ మొదలుపెట్టేద్దాం అన్నారు.
వర్కవుట్ కాలే
కానీ, అంత హడావుడిగా సినిమా స్టార్ట్ చేయలేనని బాలాజీ వెనకడుగు వేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలుసుకున్నారు కానీ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. పైగా విజయ్ తననుంచి ఫ్యామిలీ స్టోరీ ఆశించాడని, అయినప్పటికీ కరుప్పు కథ నచ్చడం తనకు చాలా సంతోషంగా అనిపించిందన్నాడు. తాజాగా మరోసారి ఈ విషయం గురించి బాలాజీ ఓపెనయ్యాడు.
రాజకీయాల్లోకి వెళ్లడంతో..
నిజానికి ఈ మూవీనే విజయ్ చివరి సినిమా అయ్యుండేది. మేము రెండుమూడుసార్లు చర్చలు కూడా జరిపాం. ఏది తన చివరి చిత్రం అయితే బాగుంటుందని మాట్లాడుకున్నాం. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్లడంతో సినిమా నుంచి తప్పుకున్నారు. ఆయన చెప్పిన కారణాలు సమంజసంగా అనిపించాయి. సార్, మీ నిర్ణయాన్ని పూర్తిగా గౌరవిస్తాను. థాంక్యూ సో మచ్ అని చెప్పాను. ఆయన నాతో సినిమా చేయాలనుకోవడమే నాకు చాలా ఆనందాన్నిచ్చింది. అది చాలు!
అందుకే థాంక్స్
తర్వాత నిర్మాతలు సూర్యను కలవమని అడిగారు. ఆయనకు కూడా స్క్రిప్ట్ ఎంతగానో నచ్చింది. సూర్య ఇచ్చిన చిన్నపాటి సలహాలతో కథలో కొంత మార్పులు చేసి సినిమా మీ ముందుకు తీసుకొచ్చాం. ఇకపోతే ఈ సినిమా కథ చెప్పినప్పుడు విజయ్ నన్ను కొన్ని ప్రశ్నలడిగారు. దానివల్లే కథను మరింత మెరుగుపర్చుకున్నాను. అందుకే విజయ్ సినిమా చేయకపోయినప్పటికీ అతడికి థాంక్స్ చెప్పాను అని తెలిపాడు. మే 15న విడుదలైన కరుప్పు రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.


