ఇప్పుడు దర్శకులు, నటులు నిర్మాతలుగా మారుతున్న తరుణం. విజయాలకు దూరమవుతున్న నటులు సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి సక్సెస్ అయ్యే ప్రయత్నాలు చేస్తుంటారు. దర్శకులుగా ఉన్నత స్థాయికి చేరుకున్న వారు కూడా సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి తమ శిష్యులకు, ఇతర నూతన దర్శకులకు అవకాశాలు కల్పిస్తుంటారు. తాజాగా దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ కూడా చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. 2019లో దర్శకుడిగా పరిచయమై రవిమోహన్ హీరోగా కోమాలి అనే చిత్రాన్ని తెరకెక్కించి హిట్ కొట్టారు.
హీరోగానూ సక్సెస్
ఆ తరువాత హీరోగా రంగప్రవేశం చేసి స్వీయ దర్శకత్వంలో లవ్టుడే పేరుతో మూవీ చేసి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తరువాత డ్రాగన్ చిత్రంలో హీరోగా నటించి సంచలన విజయాన్ని అందుకున్నారు. అదే విధంగా ఈయన కథానాయకుడిగా నటించిన డ్యూడ్ ఘన విజయాన్ని సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార నిర్మించిన ఎల్ఐకే చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించారు. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
నిర్మాతగా..
ఇకపోతే మళ్లీ మెగాఫోన్ పట్టుకొనేందుకు రెడీ అయిన ప్రదీప్ రంగనాథన్ తానే హీరోగా ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థలో చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన సడెన్గా సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి చిత్ర షూటింగ్ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనికి దర్శకుడు ఎవరు? కథానాయకుడు ఎవరు? అన్న వివరాలు వెలువడలేదుగానీ హీరోయిన్గా మమితాబైజు నటిస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ప్రదీప్ డ్యూడ్ మూవీలో మమిత హీరోయిన్ అన్న విషయం తెలిసిందే!


