ఈమాట చెప్పగానే అమల, చైతన్య ఆశ్యర్యపోయారు: నాగార్జున | Nagarjuna: Naa Saami Ranga Movie Success Meet | Sakshi
Sakshi News home page

ఈమాట చెప్పగానే అమల, చైతన్య ఆశ్యర్యపోయారు: నాగార్జున

Jan 29 2024 12:24 AM | Updated on Jan 29 2024 10:42 AM

Nagarjuna: Naa Saami Ranga Movie Success Meet - Sakshi

‘‘సెప్టెంబరు 20న నాన్నగారి(అక్కినేని నాగేశ్వరరావు) బర్త్‌ డే. ఆ రోజు విగ్రహావిష్కరణ పూర్తికాగానే ‘నా సామిరంగ’ షూటింగ్‌కు బయలుదేరాను. ‘ఎందుకంత తొందర.. ఇంకాస్త సేపు ఉండొచ్చుగా’ అని అమల నాతో అన్నారు. సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని నేను చెప్పగానే పిల్లలతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. నేను సంక్రాంతికి సినిమాను రిలీజ్‌ చేస్తానన్న నమ్మకాలు బయట ఎవరికీ లేవు. నా టీమ్‌ ముఖాల్లో మాత్రం ఆ నమ్మకం ఉంది. సినిమాను  రిలీజ్‌ చేశాం. కీరవాణిగారు బాగా సపోర్ట్‌ చేశారు. మా టీమ్‌ అందర్నీ చాలా మిస్‌ అవుతున్నాను’’ అని నాగార్జున అన్నారు.

ఆయన హీరోగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్‌ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్నామీనన్ , రుక్సార్‌ థిల్లాన్ , షబ్బీర్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నా సామిరంగ’. కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్రయూనిట్‌ చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఈ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘మాపై అపరిమితమైన ప్రేమను చూపిస్తున్న అక్కినేని ఫ్యాన్స్‌కు ముందుగా థ్యాంక్స్‌.

సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా ఎప్పుడూ ఒకేలా ఉంటారు. నేను కనపడగానే నవ్వుతూనే ఉంటారు. ఆ నవ్వే నాకు చాలా ధైర్యం. అలాగే తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్‌. సంక్రాంతికి రిలీజ్‌ చేస్తున్నామని, కాస్త ఆలస్యంగా మేం చెప్పినప్పటికీ సహకరించిన డిస్ట్రిబ్యూటర్స్‌కు థ్యాంక్స్‌. నెక్ట్స్‌ సంక్రాంతికి కలుద్దాం’’ అన్నారు. ‘‘నాగార్జునగారితో సినిమా చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను.  కీరవాణి, చంద్ర బోస్‌గార్లు ఇలానే కలిసి ఉంటూ ఇంకా మంచి మ్యూజిక్‌ ఇవ్వాలి’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్‌.

‘‘ఓ సినిమా విడుదలై, సక్సెస్‌ సాధించి, సెలబ్రేషన్స్ షీల్డ్స్‌ అందుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇలా నా తొలి సినిమాకే జరగడం నా అదృష్టం’’ అన్నారు  విజయ్‌ బిన్నీ. ‘‘నవరస భరితమైన సినిమాగా ‘నా సామిరంగ’ నిలిచింది’’ అన్నారు సంగీత దర్శకుడు కీరవాణి. ఈ సక్సెస్‌మీట్‌లో పాటల రచయిత చంద్రబోస్‌ మాట్లాడారు. ఈ కార్య క్రమంలో నాగార్జున, కీరవాణి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూటర్స్, చిత్రబృందం షీల్డ్స్‌ అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement