
ఒకప్పుడు ఓ మాదిరిగా ఉంటే చాలు సినిమాలు జనాలకు నచ్చేసేవి. ఇప్పుడు పరిస్థితి చాలా మారిపోయింది. స్టోరీ ఎలా ఉన్నాసరే ట్రెండ్కి తగ్గట్లు పాటలు, సీన్స్ లాంటివి ఉన్నాయా లేదా అని అందరూ చూస్తున్నారు. ఒకవేళ అలా లేకపోతే మాత్రం కనెక్ట్ కావట్లేదు. ఇప్పుడు ఆ పాయింట్ని 'గుంటూరు కారం' టీమ్ మరింత బలంగా నమ్మినట్లు ఉంది. ఎవరో ఓ అనామకుడు చెప్పిన డైలాగ్ ఫేమస్ అయ్యేసరికి, దాంతో ఏకంగా పాట రెడీ చేసేసింది.
ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా. ఎప్పుడు ఎవరు ఎందుకు ఫేమస్ అవుతారో తెలీదు. అలా కొన్నాళ్ల ముందు ఓ తాత, తన మాటతీరుతో తెగ వైరల్ అయిపోయాడు. 'కుర్చీ మడతపెట్టి..' అని ఇతడు చెప్పిన ఓ డైలాగ్ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. డైలాగ్లో ఓ బూతు పదం కూడా ఉన్నప్పటికీ.. చాలామందికి ఇదో ఊతపదంలా మారిపోయింది. ఇప్పుడు దాన్నే పట్టుకుని ఏకంగా మాస్ పాట చేసేశారు.
(ఇదీ చదవండి: అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి 'హాయ్ నాన్న'.. స్ట్రీమింగ్ డేట్?)
మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో తీస్తున్న 'గుంటూరు కారం' మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి రానుంది. తాజాగా షూటింగ్ పూర్తి కాగా, ఓవైపు ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. అలా ఓ మాస్ గీతానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. కొన్నాళ్ల ముందు కుర్చీ తాత చెప్పిన డైలాగ్తోనే పాట మొత్తం కంపోజ్ చేసినట్లు అనిపిస్తోంది.
ఈ ప్రోమోలో మహేశ్-శ్రీలీల స్టెప్పులు కూడా ఇరగదీసినట్లు కనిపిస్తుంది. మరి ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో ఏంటో తెలియాలంటే మాత్రం శనివారం(డిసెంబరు 30) వరకు వెయిట్ చేయాల్సింది. ఇకపోతే జనవరి 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని, అదే రోజు ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
(ఇదీ చదవండి: Bubblegum Review: 'బబుల్ గమ్' సినిమా రివ్యూ)