ప్రస్తుతం టాలీవుడ్లో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. పర్సంటేజీ సమస్య ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది గానీ ఇదంతా జరగడానికి ముందు అటు నిర్మాతలు, ఇటు ఎగ్జిబిటర్లు.. మీడియా ముందుకు వచ్చి తమ సమస్యలని చెప్పుకొన్నారు. కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడీ విషయంపై టాలీవుడ్ నిర్మాత మధుర శ్రీధర్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా షాకింగ్ కామెంట్స్ చేశారు.
(ఇదీ చదవండి: చాలా భయమేస్తోంది.. ఇలానే అయితే ఏం సినిమాలు తీయాలి?)
ఏ బిజినెస్లోనైనా రిస్కులు, ఒత్తిడులు, నష్టాలు సహజం. వాటిని ముందే అర్థం చేసుకుని రంగంలోకి వస్తారు. సినిమా కూడా అంతే. నిజంగా పరిస్థితులు అనుకూలంగా లేవనిపిస్తే సినిమాలు తీయకండి. ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లిపోండి. కానీ ప్రతిసారి మైకు ముందు వచ్చి 'సమస్యలు… సమస్యలు…' అంటూ ఏడవడం వల్ల ఇండస్ట్రీ పరువు మాత్రమే పోతుంది! ఇదేదో ప్రపంచ సమస్య అయినట్టు… భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం అయినట్టు. సినిమా ఒక బిజినెస్… ఛారిటీ కాదు!'
'సిన్సియర్గా సినిమాలు తీయండి. వర్కౌట్ అయితే ఉండండి. వర్కౌట్ కాకపోతే బయటికి వెళ్లి వేరే బిజినెస్ చేసుకోండి. ఒక సినిమాలో నష్టం వస్తే ఆ నష్టాన్ని తట్టుకునే శక్తి ఉంటే ఇంకో సినిమా తీయండి. లేకపోతే ఆగిపోండి. మీ సమస్యలు, మీ కంపెనీ సమస్యలు, మీ వ్యక్తిగత సమస్యలు అన్నీ కూడా సినిమా ప్రాజెక్ట్పై రుద్దకండి. సినిమా ఒక అద్భుతమైన మీడియం. దాన్ని బాధల వేదికగా మార్చొద్దు. సిన్సియర్గా సినిమాలు తీయండి. ప్రతి మంచి సినిమాకి ప్రేక్షకుల్లో ఒక మంచి స్థానం తప్పకుండా ఉంటుంది' అని మధుర శ్రీధర్ చెప్పుకొచ్చారు.
స్నేహగీతం, ఇట్స్ మై లవ్ స్టోరీ, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సినిమాలని డైరెక్ట్ చేసిన ఈయన.. తర్వాత నుంచి నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తున్నారు. గతేడాది ఈయన నుంచి మోతవరి లవ్ స్టోరీ, సంతాన ప్రాప్తిరస్తు మూవీస్ వచ్చాయి.
(ఇదీ చదవండి: చిరు జోక్యంతో సద్దుమణిగిన 'పెద్ది' వివాదం)


