చాలా భయమేస్తోంది.. ఇలానే అయితే ఏం సినిమాలు తీయాలి? | Dil Raju And Sai Rajesh Said Bitter Truth OF Tollywood | Sakshi
Sakshi News home page

Dil raju Sai Rajesh: ఇండస్ట్రీలో చాలామందికి నచ్చని నిజాలు

May 27 2026 5:15 PM | Updated on May 27 2026 6:52 PM

Dil Raju And Sai Rajesh Said Bitter Truth OF Tollywood

తెలుగులో ప్రతివారం సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. కానీ ఏవీ హిట్ అవ్వట్లేదు. ఒకటిరెండు రోజుల మెరుపులు తప్పితే బాక్సాఫీస్ దగ్గర అడ్డంగా బోల్తా కొట్టేస్తున్నాయి. కానీ చాలామంది దర్శకనిర్మాతలకు ఈ నిజం ఒప్పుకోవడానికి ఇప్పటికీ మనసు రావట్లేదు. అంతకుముందు రివ్యూయర్లపై నెపం నెట్టేసేవారు. కానీ ఇప్పుడు మెల్లగా పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారు. నవ్వుతూ నిజాలు చెప్పేస్తున్నారు. అసలు తెలుగు సినిమాల పరిస్థితి ఇలా ఎందుకు తయారైందో నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ సాయి రాజేశ్ చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: కళ్లు తెరిపించే కోర్ట్ రూమ్ సినిమా.. ఓటీటీ తెలుగు రివ్యూ)

'యూట్యూబ్ వ్యూస్, కామెంట్స్ కొనేస్తున్నాం. ట్విటర్‌లో నెగిటివిటీ ఉంటే దాన్ని పాజిటివ్‌గా మార్చేస్తున్నాం. ఏది నిజం? ఏది అసలు కంటెంట్? ఏది కావట్లేదు? ఏది జనాలకు ఎక్కుతుంది? ఏది ఎక్కదు? అసలు ఏం జరుగుతుందనేది తెలియక లోపల ప్యాక్ అయిపోతోంది. పాట బాగుందా? ఓపెనింగ్ వస్తాదా రాదా అని అందరికీ ఫోన్లు చేయడం. జనాలకు కూడా ఇండస్ట్రీ అంటే విరక్తి వచ్చేసింది. చాలా భయమేస్తోంది. ఇలా చేసుకుంటూ పోతే ఏం కథలు రాయాలి? ఏం సినిమాలు తీయాలి? ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. రొమ్ కామ్, థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ ఇలాంటి కొన్ని జానర్లని మనం చంపేశాం. నేను నమ్మకంగా చెబుతున్నా 'బేబి'ని ఇప్పుడు రిలీజ్ చేస్తే సగం షేర్ కూడా రాదు. ఈ రెండేళ్లలో అంత మార్పులొచ్చేశాయి' అని 'బేబి' దర్శకుడు సాయి రాజేశ్ అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీ ప్రస్తుతం కష్టకాలంలో ఉందని చెప్పడానికి చాలామంది భయపడతారు. కానీ నేను ధైర్యంగా చెబుతున్నా. ఇండస్ట్రీ ఇప్పుడు చాలా బ్యాడ్ షేప్‌లో ఉంది. ప్రేక్షకుల్ని థియేటర్‌కి తీసుకురావడమే మనందరికీ పెద్ద సవాల్. చిన్న సినిమాలు ఎంత సక్సెస్ అయితే ఇండస్ట్రీ అంత హెల్తీగా ఉంటుంది' అని చెప్పారు.

పైన ఇద్దరూ ఇండస్ట్రీకి చెందినవాళ్లే. వీళ్లు ఇప్పుడు ఈ విషయాల్ని చెబుతున్నారు గానీ జనాలకు వీటి గురించి ఎప్పుడో అర్థమైపోయింది. ఎందుకంటే చిన్నా పెద్దా ఏ సినిమా రిలీజైనా సరే అసలు టాక్ రావడం కంటే ముందే సోషల్ మీడియాలో పాజిటివ్ పోస్టులని చాలామంది దర్శకనిర్మాతలే ప్రోత్సాహిస్తున్నారు. వచ్చిన కలెక్షన్స్‌కి సంబంధం లేకుండా పోస్టర్లపై పెద్ద పెద్ద నంబర్లు వేసి ప్రేక్షకుల్ని మభ్యపెడుతూ వచ్చారు. ఫలితంగా ఇప్పుడు టాలీవుడ్ దాని పర్యవసనాలని అనుభవిస్తోందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు!

(ఇదీ చదవండి: తెలుగులో చాన్నాళ్ల తర్వాత పిల్లల సినిమా.. టీజర్ రిలీజ్)

Advertisement
 
Advertisement
Advertisement