తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కళగం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి విజయ్కు ప్రజలు, ప్రతిపక్షాలు కొంత సమయం ఇవ్వాలని ప్రముఖ సినీ నటి, బుల్లితెర నిర్మాతల సంఘం అధ్యక్షురాలు కుష్బూ అభిప్రాయపడ్డారు. కేవలం పది రోజుల్లోనే అన్ని మార్పులను ఎలా తీసుకురాగలరని ఆమె ప్రశ్నించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి విజయ్, విద్యా , సాంస్కృతితిక శాఖ మంత్రి రాజమోహనన్ను కుష్బూ నేతృత్వంలోని బుల్లితెర నిర్మాతల సంఘం ప్రతినిధులు కలిసి ఒక కోరికల వినతిపత్రాన్ని సమర్పించారు.
సమస్యల పరిష్కారానికి సీఎం హామీ
ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం కుష్బూ మీడియాతో మాట్లాడారు. బుల్లితెర రంగంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న, మధ్యతరహా నిర్మాతల సంక్షేమం కోసం కొన్ని ముఖ్యమైన డిమాండ్లను ముఖ్యమంత్రి ముందు ఉంచామన్నారు. తమ విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించిన సీఎం విజయ్, మంత్రి రాజమోహన్ వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని కుష్బూ తెలిపారు.
విజయ్ నా తమ్ముడు..
ముఖ్యమంత్రి విజయ్తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కుష్బూ కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. సీఎం విజయ్ను నా సొంత తమ్ముడిగా చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాననని పేర్కొన్నారు.. ఒక అక్కగా ఈరోజు ఆయనను ముఖ్యమంత్రి హోదాలో చూసినప్పుడు నా మనసు నిండిపోయిందంటూ చాలా ఎమోషనల్ అయ్యానని తెలిపారు. ఆయన పనితీరు, ఆలోచనలు చూస్తుంటే భవిష్యత్తులో తమిళనాడులో కచ్చితంగా ఒక మంచి మార్పును తీసుకువస్తారనే నమ్మకం నాకు కలిగిందన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నింటినీ ఒకే రోజులో సర్దుబాటు చేయడం ఎవరికై నా సాధ్యమేనా?, విజయ్ పగ్గాలు చేపట్టిన కేవలం 10 రోజుల్లోనే ఎలా మార్చగలరు? ముఖ్యమంత్రికి కాస్త సమయం ఇవ్వండి. తమిళనాడులో కచ్చితంగా మార్పు వస్తుంది అని వ్యాఖ్యలుచేశారు.


