‘ఆయుష్మాన్ భవ’ షో ఫేం మేఘా గుప్తా గురించి ఈ విషయాలు తెలుసా?

హిందీ సీరియల్స్ను క్రమం తప్పకుండా ఫాలో అయ్యేవారికి బాగా తెలిసిన పేరు.. మేఘా గుప్తా! ఇప్పుడు వెబ్ తెరకూ పరిచయమై తన టాలెంట్తో వెబ్ వీక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటోందీ నటి.
►పుట్టింది లక్నోలో. పెరిగింది ఒమాన్లో. చదివింది ముంబైలో. మాస్ మీడియాలో బ్యాచ్లర్స్ డిగ్రీ పూర్తి చేసింది.
► డిగ్రీ చదువుతున్న టైమ్లోనే మోడలింగ్ చాన్సెస్ రావడంతో అందిపుచ్చుకుంది. మోడల్గా రాణించింది.
► ఆమె నటనారంగ ప్రవేశం చాలా చిత్రంగా జరిగింది. మేఘా గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు.. ప్రాజెక్ట్ వర్క్ కోసం బాలాజీ ప్రొడక్షన్ హౌస్ సీఈవోను కలిసింది. వివరాలు తీసుకుని వెళ్లిపోయింది. కాలేజ్లో ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేసింది.. బాలాజీ ప్రొడక్షన్ హౌస్ గురించి మరచిపోయింది. సరిగ్గా అప్పుడే ఆ సంస్థ నుంచి ఆమెకు ఫోన్కాల్ వచ్చింది.. తాము ఒక సీరియల్ తీయబోతున్నట్టు అందులో ఓ పాత్రను ఆమెకు ఆఫర్ చేస్తున్నట్టు. విని ఆశ్చర్యపోయింది మేఘా. తేరుకుని ఆ పాత్రకు ఓకే చెప్పింది. అదే ‘కావ్యాంజలి’.. సూపర్హిట్ సీరియల్.
► కావ్యాంజలి తర్వాత ‘నచ్ బలియే’ సీజన్ 4, ‘ఆయుష్మాన్ భవ’ వంటి రియాలిటీ షోల్లోనూ పార్టిసిపేట్ చేసింది.
► అవి నటనారంగంలో ఆమెకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టాయి. అలా ‘కుమ్కుమ్’, ‘మమతా’, ‘సీఐడీ’,‘డ్రీమ్ గర్ల్’, ‘మై తేరీ పర్ఛాయీ హూ’ వంటి సీరియల్స్లో నటించింది. ‘పర్ఫెక్ట్ బ్రైడ్’ అనే కార్యక్రమానికి హోస్ట్గానూ వ్యవహరించి.. దేశమంతా పాపులర్ అయింది. ఆ పాపులారిటీయే ఆమెను వెండి తెర మీదా కనిపించేలా చేసింది.. షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘ఫ్యాన్’ సినిమాతో.
► ప్రస్తుతం ‘బ్రైబ్’ అనే వెబ్ సిరీస్తో వెబ్ వీక్షకులనూ అలరిస్తోంది.