ఏ సినిమా అయినా సరే.. టికెట్ ధర రూ.200కి దాటకూడదని కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ఓ నిర్ణయం తీసుకుంది. ఇతర భాషా చిత్రాలకు సైతం ఇదే వర్తిస్తుందని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని కర్ణాటక మల్టీప్లెక్స్ థియేటర్ల ఓనర్లు వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
సినిమా చూడాలంటే రూ.2000?
టికెట్ ధరలతో పాటు థియేటర్లలో విక్రయించే తినుబండారాలపై భారీ మొత్తంలో వసూలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఒక్క నీళ్ల బాటిల్కు రూ.100, కాఫీకి రూ.700 వసూలు చేస్తారా? అని ఆగ్రహించింది. సాధారణ ప్రజలు ఒక సినిమా చూడటానికి మల్టీప్లెక్స్కు వస్తే రూ.1,500 నుంచి రూ.2,000 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇప్పటికే థియేటర్లకు వచ్చేవారి సంఖ్య తగ్గుతోంది.
ఇలాగైతే థియేటర్లు ఖాళీ
టికెట్, తినుబండారాల ధరలు అందుబాటులో లేకపోతే థియేటర్లు ఖాళీ అవడం ఖాయం అని అభిప్రాయపడింది. టికెట్ ధర రూ.200 ఉండాలనే హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాన్ని తాము సమర్థిస్తున్నామని జస్టిస్ విక్రమ్ నాథ్ తెలిపారు. అయితే టికెట్ కౌంటర్లలో డబ్బు చెల్లించి టికెట్లు కొనుగోలు చేసే వారి గుర్తింపు కార్డు (ఐడీ) వివరాలు సేకరించాలన్న హైకోర్టు ఉత్తర్వులు తక్షణమే అమలు కాకుండా వాటిపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


