గత నెల రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్-2 దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్టయిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెండో భాగం (ధురంధర్-2) ఎలా ముగిసిందో సినిమా చూసిన వాళ్లందరికీ తెలిసే ఉంటుంది. భార్య, కొడుకును వదిలి ఇండియా వచ్చేస్తాడు హీరో. ఆ తర్వాత ‘RAW’ కనుసన్నల నుంచి తప్పించుకొని నేరుగా తన ఇంటికి వెళ్తాడు. అయితే దూరం నుంచే తన తల్లిని, చెల్లిని చూసి తిరిగి వెనుదిరుగుతాడు. ఇలా సాగిన ధురంధర్-2 క్లయిమాక్స్ నుంచి ధురంధర్-3 కథను అల్లేస్తున్నారు సోషల్ మీడియాలోని కొంతమంది జనం.
అయితే హీరో మరోసారి రా ఏజెంట్గా పాకిస్థాన్లో అడుగుపెడతాడని, కొత్త గెటప్లో పాకిస్టాన్లో మరోసారి అడుగుపెట్టి తన భార్య, కొడుకును కలుస్తాడంటూ ఎవరికివారు కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా అల్లేస్తున్నారు. ఇలా ధురంధర్ ఫ్రాంచైజీపై ఓ కొత్త చర్చ జరుగుతోంది. అయితే నిజానికి ధురంధర్-3పై దర్శకుడు ఆదిత్య ధర్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఇటీవల ఇదే ప్రశ్న ఆదిత్య ధర్కి ఎదురైంది. దానికి 'ఏమో చెప్పలేం' అన్నట్టు మాత్రమే ఆయన స్పందించాడు. అంతేకానీ ధురంధర్-3 తప్పకుండా తీస్తానని ఆదిత్య ధర్ అనలేదు.
కానీ సోషల్ మీడియాలో వస్తున్న కథలని నిజానికి ఓసారి పరిశీలిస్తే ఈ దర్శకుడికి కచ్చితంగా పార్ట్-3కి ఓ లైన్ దొరికే అవకాశం ఉందనే అంటున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు.


