ధనుశ్, మమిత బైజు జంటగా నటించిన తాజా మూవీ కర. ఈ సినిమాకు విఘ్నశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈశారి గణేశ్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న థియేటర్లలో రిలీజైంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి విడుదల చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. నెట్ఫ్లిక్స్ వేదికగా అందుబాటులో ఉంది.
బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించిన ఈ సినిమా.. ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది. స్ట్రీమింగ్కు వచ్చిన తొలివారంలోనే దూసుకెళ్తోంది. ఇండియన్ సినిమాల జాబితాలో నెట్ఫ్లిక్స్లో నంబర్వన్ ప్లేస్లో కొనసాగుతోంది. దీంతో మేకర్స్తో పాటు ధనుశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కర అసలు కథేంటంటే..
ఈ సినిమా కథ 1990 నేపథ్యంలో సాగుతుంది. కరస్వామి అలియాస్ కర(ధనుష్) ఒక దొంగ. తన తండ్రి కోదండం (కేఎస్ రవికుమార్) దగ్గర డబ్బు దొంగిలించి.. ఇంట్లో నుంచి పారిపోతాడు. చివరిగా ఒక దొంగతనం చేసి మానేయాలనుకొని స్నేహితుడితో కలిసి ఓ ఇంట్లోకి వెళ్తాడు. డబ్బులు తీసుకెళ్తున్న సమయంలో ఇంట్లోవాళ్లు పట్టుకొని..పోలీసులకు అప్పగిస్తారు. ఈ కేసు రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న డీఎస్పీ భరతన్(సూరజ్ వెంజర్మూడు) చేతికి వెళ్లగా.. కర అతన్ని కొట్టి స్టేషన్ నుంచి పారిపోతాడు. ఇకపై దొంగతనాలు చేయనని చెప్పి ప్రియురాలు మల్లి(మమిత బైజు) పెళ్లి చేసుకొని ఓ హోటల్లో పని చేస్తారు. కొన్నాళ్ల తర్వాత సొంతంగా హోటల్ పెట్టుకోవాలనుకుంటారు.
లోన్ కోసం బ్యాంకుకు వెళ్తే.. షూరిటీ అడుగుతారు. పొలం కాగితాలు పెట్టి లోన్ తీసుకుందామని ఊరికి వెళ్లగా.. తండ్రి అప్పటికే వాటిని బ్యాంకుల్లో పెట్టి అప్పు తీసుకుంటాడు. అప్పు కట్టకపోతే పొలాన్ని జప్తి చేస్తామని బ్యాంకు నోటీసులు పంపడం.. కొడుకు డబ్బుల కోసమే తన దగ్గరకు వచ్చాడనే బాధతో కోదండం చనిపోతాడు. తండ్రి చివరి కోరిక మేరకు పార్థివదేహానికి పొలంలోనే పూడ్చేందుకు వెళ్లగా..బ్యాంకు అధికారులు అడ్డుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? తండ్రి చివరి కోరిక నెరవేర్చడం కోసం కర ఏం చేశాడు? బ్యాంకుల్లో జరుగుతున్న దొంగతనాలకు అతనికి ఉన్న సంబంధం ఏంటి? ఎస్పీ భరతన్ తిరిగి కరను పట్టుకున్నాడా లేదా? ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంకు మేనేజర్(జయరాం) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


