భైరవం మూవీ రివ్యూ | Bhairavam Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Bhairavam Review: భైరవం మూవీ రివ్యూ

May 30 2025 1:42 PM | Updated on May 30 2025 4:11 PM

Bhairavam Movie Review And Rating In Telugu

టైటిల్‌: భైరవం
నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్, అతిధి శంకర్‌, ఆనంది , దివ్య తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీ సత్య సాయి ఆర్ట్స్
నిర్మాత: కేకే రాధామోహన్‌
దర్శకత్వం: విజయ్‌ కనకమేడల
సంగీతం: శ్రీచరణ్‌ పాకాల
సినిమాటోగ్రఫీ: హరి కె వేదాంతం
ఎడిటర్‌: చోటా కె ప్రసాద్‌
విడుదల తేది: మే 30, 2025

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్.. ఈ ముగ్గురు హీరోల ఖాతాలో హిట్‌ పడి చాలా కాలమైంది. ఈ మధ్యకాలంలో వీరి నుంచి సినిమాలే రాలేదు. చాలా గ్యాప్‌ తర్వాత ఈ ముగ్గురు కలిసి ఒకే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే భైరవం. విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహించారు. తమిళ బ్లాక్‌ బస్టర్‌ 'గరుడన్‌’ తెలుగు రీమేకే ఈ భైరవం. టాలీవుడ్‌ ప్రేక్షకులకు నచ్చేలా కొన్ని మార్పులు చేసి సినిమాను తెరకెక్కించామని మేకర్స్‌  చెప్పారు. మరి ఆ మార్పులలో తెలుగు ఆడియన్స్‌ని మెప్పించారా లేదా? సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. (Bhairavam Review)

భైరవం కథేంటంటే..?
తూర్పు గోదావరి జిల్లా దేవిపురం గ్రామానికి చెందిన గజపతి(మనోజ్‌), వరద(నారా రోహిత్‌),శీను(బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ(జయసుధ) మరణించడంతో అనుకోకుండా ఆ ఆలయ ధర్మకర్త బాధ్యతలు శీను చేతికి వస్తాయి. ఆ గుడి ఆస్తులపై మంత్రి వెదురుమల్లి కన్నుపడుతుంది. ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలను దక్కించుకోవాలని కుట్ర పన్నుతాడు. (Bhairavam Review)

మంత్రి చేసే కుట్రను అడ్డుకొని భూమికి సంబంధించిన పత్రాలను వరద తన దగ్గర పెట్టుకుంటాడు. భార్య నీలిమ(ఆనంది) ఒత్తిడితో గజపతి ఆ గుడి పత్రాలను మంత్రికి ఇస్తానని ఒప్పుకుంటాడు. ఈ విషయం వరదకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? గుడి ఆస్తులను కాపాడేందుకు వరద ఏం చేశాడు? గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని శీను ఎలా రక్షించాడు. గజపతి గురించి శీనుకు తెలిసిన నిజం ఏంటి? మంత్రి చేసిన కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి. అమ్మవారి పూనకం వచ్చే శీను.. న్యాయం కోసం చివరకు ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 
ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు పడిన తర్వాత రీమేక్‌ చిత్రాలు రావడం తగ్గిపోయాయి. ఓ మంచి సినిమా ఏ భాషలో వచ్చినా సరే ఓటీటీల పుణ్యమా అని అన్ని ప్రాంతాల ప్రేక్షకులు చూసేస్తున్నారు. అలాంటి సమయంలో తమిళ బ్లాక్‌ బస్టర్‌ గరుడన్‌ని తెలుగులో రీమేక్‌ చేశాడు దర్శకుడు విజయ్‌ కనకమేడల. ఇది ఓ రకంగా పెద్ద సాహసమే. కానీ దానికి తగిన న్యాయం చేయలేకపోయాడు దర్శకుడు. ఒరిజినల్‌ సినిమాలోని ఎమోషన్‌ని ఇందులో క్యారీ చేయలేకపోయాడు. కథలో ఆయన చేసిన చిన్న చిన్న మార్పులే దీనికి కారణం. ముగ్గురు హీరోలను మేనేజ్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యాడు కానీ సెంటిమెంట్స్‌ని పండించే విషయంలో తడబడ్డాడు.

ఒరిజినల్‌లో బెల్లంకొండ పాత్రను సూరి పోషించాడు. ఆయనకున్న ఇమేజ్‌కి ఆ పాత్ర కొత్తగా అనిపించింది. కానీ బెల్లంకొండకు ఇక్కడ ఉన్న ఇమేజ్‌ వేరు. దీంతో ఆ పాత్రలో ఆయన ఒదిగినట్లుగా కాకుండా నటించినట్లుగానే అనిపిస్తుంది. అలాగే మనోజ్‌ పాత్ర కూడా. ముగ్గురు హీరోలకు ఎలివేషన్స్‌ ఇవ్వడంపైనే దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టాడు. అమ్మవారి ట్రాక్‌ని కూడా సరిగా వాడుకోలేకపోయాడు.  

సినిమా ప్రారంభం కాస్త ఆసక్తికరంగానే ఉంటుంది. గుడి నేపథ్యంతో పాటు ముగ్గురు హీరోల పరిచయం తర్వాత కథనం నెమ్మదిగా సాగుతుంది.  శీను-వెన్నెల(అతిధి శంకర్‌) లవ్‌ ట్రాక్‌ అంతగా ఆకట్టుకోలేదు. ఇంటర్వెల్‌ ముందు వచ్చే యాక్షన్‌ సీన్‌ ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం సాగదీసినట్లుగా ఉంటుంది. గరుడన్‌ చూసిన వారికి ట్విస్టులు కూడా తెలుస్తాయి కనుక.. అవి కూడా ఆకట్టుకోలేవు. ఇక గరుడన్‌ చూడని ప్రేక్షకులకు మాత్రం కొన్ని ట్విస్టులు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్‌ బాగుంటుంది. 

ఎవరెలా చేశారంటే..  
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, మనోజ్‌, రోహిత్‌..ముగ్గురూ టాలెంటెడ్‌ నటులే. మంచి పాత్రలు పడాలేకానీ రెచ్చిపోయి నటిస్తారు. భైరవంలోనూ వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. బెల్లంకొండ శ్రీనివాస్‌కి ఈ సినిమా ప్లస్‌ అవుతుందని చెప్పాలి. శీను పాత్రలో ఆయన జీవించేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే పూనకాల సీన్‌లో అదరగొట్టేశాడు. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న గజపతి వర్మగా మనోజ్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్‌ సీన్లలో బాగా నటించాడు. 

ఇక నారా రోహిత్‌ తన పాత్రకి న్యాయం చేశాడు. హీరోయిన్లు అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. వెన్నెల కిశోర్‌ , జయసుధ‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. శ్రీచరణ్‌ పాకాల పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ అయింది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement