నాకు.. నరేశ్‌కి ఆ అదృష్టం దక్కింది

Actress Jayasudha Speech at Malli Pelli Pre Release Event - Sakshi

– జయసుధ  

‘‘చిత్ర పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం అందరికీ కుదరదు. కానీ నాకు, నరేశ్‌కు ఆ అదృష్టం దక్కింది. విజయనిర్మలగారు ‘పండంటి కాపురం’ చిత్రం ద్వారా నన్ను, నరేశ్‌లను పరిచయం చేశారు. మన వ్యక్తిగత విషయాల పరంగా ఎవరికీ భయపడక్కర్లేదు’’ అని నటి జయసుధ అన్నారు. వీకే నరేశ్, పవిత్రా లోకేష్‌ జంటగా ఎమ్మెస్‌ రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. విజయ కృష్ణ మూవీస్‌పై వీకే నరేశ్‌ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 26న విడుదలకానుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ‘ఆకాశమే..’ అనే సాంగ్‌ను జయసుధ విడుదల చేశారు. నటిగా యాభై ఏళ్లు పూర్తిచేసుకున్న జయసుధను నరేశ్‌ సత్కరించగా, నటుడిగా యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న నరేశ్‌ ఎమ్మెస్‌ రాజు ఆధ్వర్యంలో జయసుధ సత్కరించారు. వీకే నరేశ్‌ మాట్లాడుతూ–‘‘నా రీల్‌ లైఫ్‌ బాగున్నా రియల్‌ లైఫ్‌ బాగోలేదు. ఇప్పుడు 50 ఏళ్లకు మా అమ్మ (విజయ నిర్మల) తర్వాత ఇంకో అమ్మను (పవిత్ర) కలుసుకున్నాను.

జీవితంలో ఫస్టాప్‌ కంటే సెకండాఫ్‌ బాగుండా లని చెప్పే చిత్రమే ‘మళ్ళీ పెళ్లి’’ అన్నారు. ‘‘నా కొత్త జీవితం ప్రారంభమైంది. ‘మళ్ళీ పెళ్లి’లో నాకు మంచి పాత్ర ఇచ్చినందుకు రాజుగారు, నరేశ్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు పవిత్రా లోకేశ్‌. ‘‘నా 12 ఏళ్లప్పుడు విజయ కృష్ణ మూవీస్‌లో ‘మీనా’ సినిమా చూశాను. ఇప్పుడు వారి బేనర్‌లో సినిమా చేస్తాననుకోలేదు. ‘మళ్ళీ పెళ్లి’ బోల్డ్‌ కథ’’ అన్నారు ఎమ్మెస్‌ రాజు.   
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top