3 కంది కొనుగోలు కేంద్రాలు
● మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు ● డిమాండ్ మేరకు కేంద్రాల పెంపు ● మద్దతు ధర క్వింటాలుకు రూ.8 వేలు
నారాయణఖేడ్: కందిపంటకు మద్దతు ధర కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇటీవలే రైతులు కంది పంట నూర్పిళ్లను ప్రారంభించిన నేపథ్యంలో సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన పక్షంలో వీరికి ఎంతో ఉపయుక్తంగా మారనుంది. కందులు క్వింటాల్కు రూ.8వేల కనీస మద్దతు ధర నిర్ణయించగా కొన్నిచోట్ల మార్కెట్లో దళారులు రూ.6,500కు కొనుగోళ్లు చేస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. ఇటీవలే కందుల కొనుగోలు కేంద్రాలను రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రారంభించింది. త్వరలోనే అన్ని జిల్లాల్లోనూ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించిన సంగతి తెలిసిందే.
అధికంగా ఈ మూడు నియోజకవర్గాల్లో..
జిల్లాలో నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాల్లో కంది పంట అధికంగా సాగవుతో ంది. జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంఘంలో పీఏసీఎస్, జహీరాబాద్లో డీసీఎంఎస్, ఖేడ్ నియోజకవర్గంలోని బాచేపల్లిలో పీఏసీఎస్ల ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. పంట దిగుబడుల డిమాండ్ మేరకు ఈ ప్రాంతాల్లో తక్షణ కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు.
డిమాండ్ మేర కేంద్రాల పెంపు..
జిల్లాలో కందుల దిగుబడుల డిమాండ్ మేరకు మరిన్ని కేంద్రాలను పెంచేందుకు మార్క్ఫెడ్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. గతేడాది నాగల్గిద్ద, సత్వార్, చెల్మడ కలాన్, ఝరాసంఘంలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కూడా రైతుల డిమాండ్ మేరకు కేంద్రాలను పెంచేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
డిమాండ్ మేర కేంద్రాలు
పంట దిగుబడులు, రైతుల డిమాండ్ మేరకు కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ఝరాసంఘం, బాచేపల్లి, జహీరాబాద్లలో కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. రైతులు కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తులను విక్రయించి మద్దతు ధర పొందాలి.
– శ్రీదేవి,
మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్, సంగారెడ్డి
జిల్లాలో కంది పంటను రైతులు ఈ ఏడాది వానాకాలంలో 76,823 ఎకరాల్లో సాగు చేశారు. వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో కంది దిగుబడి గణనీయంగా వచ్చింది. పెసర, మినుము పంటలు వర్షాల వల్ల దెబ్బతినగా కంది పంటకు మాత్రం మేలు చేశాయి. ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల వరకు దిగుబడులు వచ్చాయి. ఏ కమతాల్లోనైనా 5 నుంచి 6 క్వింటాళ్లకు తగ్గకుండా పంట దిగుబడులున్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. మంచి దిగుబడులు రావడంతో కొనుగోలు కేంద్రాలతోనే రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఏడాది భారీ వర్షాలు కురవడం వల్ల వరి పంట సాగు పెరగడంతో కొంత కంది పంట విస్తీర్ణం తగ్గింది.


