మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో గిరిజన కుటుంబాలకు అందించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ కుమార్, డీసీపీ భాస్కర్, అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, డీఆర్వో మోతీరాం, డైరెక్టర్ ఆఫ్ కళ్యాణ్, ఉట్నూర్ ఐటీడీఏ పీవో అంబాజీతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులకు విద్య, వైద్యం, విద్యుత్, తాగునీరు, ఉపాధి, తదితర సదుపాయాలు సమర్థవంతంగా అందించాలన్నారు. అటవీశాఖ పరిధిలో గిరిజనుల హక్కులు, అందుతున్న సౌకర్యాలు, అటవీ ఆధారిత జీవనోపాధి, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. గిరిజనుల జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా వారి హక్కులను పరిరక్షిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
గిరిజనుల సమస్యలు నిర్లక్ష్యం చేయొద్దు
దండేపల్లి: గిరిజనుల సమస్యలను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ ఆదేశించారు. దండేపల్లి మండలం లింగాపూర్, దమ్మన్నపేట, తానిమడుగు గ్రామాల్లో పర్యటించి గిరిజనుల సమస్యలు తెలుసుకున్నారు. ఆయన వెంట మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు, దండేపల్లి తహసీల్దార్ రోహిత్దేశ్పాండే, ఎంపీడీవో ప్రసాద్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్, అధికారులు ఉన్నారు.
ఎస్సీ, ఎస్టీ కోర్టు మంజూరుకు కృషి
మంచిర్యాలక్రైం: జిల్లాకు ఎస్సీ, ఎస్టీ కోర్టు మంజూరుకు కృషి చేస్తానని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ అన్నారు. మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనను స్థానిక బార్ అసోసియేషన్ సభ్యులు కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పులి రాయమల్లు, సత్యనారాయణ, మల్లారెడ్డి, రవీందర్, కమల మనోహర్, తులా అంజనేయులు, మంజుల, లక్ష్మీప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.


