
అప్పీళ్లు లేని అంతిమ తీర్పు
మంచిర్యాలక్రైం: లోక్ అదాలత్లో పరిష్కరించిన కేసులు అప్పీళ్లు లేని అంతిమ తీర్పు అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ.వీరయ్య అన్నారు. జిల్లాలోని వివిధ కోర్టు ప్రాంగణంలో శనివారం ఎనిమిది బెంచ్లు ఏర్పాటు చేసి లోక్ అదాలత్ నిర్వహించినట్లు తెలిపారు. మంచిర్యాల లోక్ అదాలత్లో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్లో 37 బ్యాంకు రికవరీ కేసులు, దాదాపు 5,250 కేసులు పరిష్కరించామని తెలిపారు. కక్షిదారులు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని కేసుల నుంచి విముక్తి పొందాలని అన్నారు. రాజీమార్గమే రాజమార్గమని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్నాయక్, సీనియర్ సివిల్ జడ్జి రాంమోహన్రెడ్డి, జూనియర్ సివిల్ జడ్జి జీ.కవిత, కే.నిరోష, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
రాజీ మార్గమే రాజమార్గం
లక్సెట్టిపేట: రాజీ మార్గమే రాజమార్గమని జూ నియర్ సివిల్ జడ్జి కాసమల సాయికిరణ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా 552 క్రిమినల్, 2 సివిల్ కేసులను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏజీపీ సత్యం, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సత్తన్న, సత్యగౌడ్, ఎస్సైలు సురేష్, శ్రీలత పాల్గొన్నారు.
లోక్ అదాలత్లో 1,458 కేసుల పరిష్కారం
చెన్నూర్: చెన్నూర్ జూనియర్ సివిల్ కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 1,458 కేసులు పరిష్కారమయ్యాయని జూనియర్ సివిల్ జడ్జి పర్వతపు రవి తెలిపారు. కోర్టు పరిధిలో 1,354 డ్రంకెన్ డ్రైవ్, న్యూసెన్స్ కేసులు పరిష్కారమయ్యాయని, ఇందులో రూ.6,36,420, బ్యాంక్ కేసులు 37 పరిష్కారం కాగా రూ.23,96,813 జరిమానా విధించామన్నారు. 44 క్రిమినల్ కేసులు, 4 సివిల్ కేసులు పరిష్కారమయ్యాయన్నారు.

అప్పీళ్లు లేని అంతిమ తీర్పు