
నాన్న కష్టమే ఎస్సైని చేసింది
జన్నారం: నాన్నంటే నడిపించే దైవమంటున్నారు జన్నారం ఎస్సై గొల్లపెల్లి అనూష. ‘కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలం రాజారాంపల్లె గ్రామానికి చెందిన గొల్లపెల్లి తిరుపతి, పుష్పలత దంపతులకు మేము నలుగురు ఆడపిల్లలం. మాది మధ్య తరగతి కుటుంబం. ఆడపిల్లలమని అధైర్య పడకుండా నాన్న నలుగురిని చదివించారు. అందరూ డిగ్రీ పూర్తి చేయగా నేను మాత్రం బీటెక్ పూర్తి చేశాను. మా అందరికీ వివాహాలు, కాన్పులు చేశారు. నేను కష్టపడి ఎస్సై ఉద్యోగం సాధించాను. నాన్న కష్టపడి చదివించడంతోనే నేను ప్రయోజకురాలిగా ఈ రోజు ఉద్యోగం చేస్తున్నాను. మమ్ములను చదివించేందుకు నాన్న దుబాయ్ వెళ్లేవారు. మాకు వివాహాలు చేసిన తర్వాత కూడా అప్పులు తీర్చడం కోసం ఇంకా దుబాయ్ వెళ్తూనే ఉన్నారు. రెండేళ్లకోసారి మా కోసం ఇక్కడికి వస్తూ తిరిగి వెళ్తుంటారు. ఆయన కష్టమే మమ్ములను ప్రయోజకులుగా చేసింది’ అంటున్నారు అనూష.