
నాన్న కష్టానికి ఫలితంగా డాక్టర్లమయ్యాం
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాలకు చెందిన చిరువ్యాపారి సిద్దంశెట్టి ప్రవీణ్, మధుశ్రీ దంపతులకు కుమారుడు ప్రీతమ్, కుమార్తె అశ్వీత సంతానం. తన పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. చేసేది చిరువ్యాపారమైనా ఇద్దరు పిల్లలను వైద్యులను చేశాడు. తండ్రి ఆశలకు అనుగుణంగా కుమారుడు ప్రీతమ్కుమార్ యూకేలో పీజీ సర్జన్ చేస్తుండగా.. కుమార్తె ఆశ్వీత ఎంజీఎంలో హౌజ్ సర్జన్గా చేస్తోంది. తమ భవిష్యత్ కోసం నాన్న పడిన శ్రమ.. ఆర్థిక కష్టాలు, అన్నీఇన్నీ కావంటున్నారు సిద్దం శెట్టి ఆశ్వీత. ‘నాన్న చదువులో ఎంతో ప్రోత్సహించేవారు. అన్నయ్య ప్రీతమ్తో సమానంగా నన్ను చదివించారు. లోనవెల్లి గ్రామంలో మా నాన్నమ్మకు వైద్యం అందక పడిన ఇబ్బందులు కళ్లారా చూశాం. అప్పుడే డాక్టర్లం అవుతామని నాన్నకు చెప్పాం. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు చదువుకు అడ్డం వస్తాయని అనుకున్నప్పటికీ నాన్న వెన్నంటి ప్రోత్సహించారు. నాన్న కల నిజం చేసి అన్నయ్య, నేను డాక్టర్లయ్యాం’ అని ఆశ్వీత గర్వంగా చెబుతున్నారు.