
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
తాండూర్: మండలంలోని బోయపల్లిలో బుధవారం నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. మహారాష్ట్రలోని గోండ్ పిప్పిరి గ్రామం నుంచి నకిలీ పత్తి విత్తనాలు తీసుకువస్తున్నట్లు తమకు అందిన సమాచారం మేరకు బోయపల్లి గ్రామ సమీపంలో మాటువేసి మాసాడి రవీందర్ అనే యువకుడు నకిలీ పత్తి విత్తనాలు తీ సుకువస్తుండగా పోలీసులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. నిందితుని వద్ద నుంచి 18 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మండల వ్యవసాయ అధికారి సుష్మ పర్యవేక్షణలో పంచనామా నిర్వహించారు. విత్తనాల విలువ రూ.54 వేల వరకు ఉంటుందని అంచనా వేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
భీమారం: మండలంలోని ఎలకేశ్వరంలో బుధవారం వ్యవసాయశాఖ, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి సూరం సురేష్ వద్ద 2 కిలోల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏవో అత్తె సుధాకర్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సురేష్పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు.