
పంట సాగులో రైతులకు చేయూత
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: పంట సాగులో రైతులకు సాగునీరు, రుణాలు, ఎరువులు, విత్తనాలు ఇతర అన్ని విధాలుగా చేయూత అందిస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం సమీకృత కలెక్టర్ సమావేశ మందిరంలో మంచిర్యాల ఎమ్మెల్యే కే.ప్రేమ్సాగర్రావు, జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతితో కలిసి వానాకాలం సాగు సంసిద్ధత సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పౌల్ట్రీ, డెయిరీ ఫారాలు, చేపల పెంపకం, పట్టు పరిశ్రమ, పెరటి కోళ్ల పెంపకం ఇతర అంశాలపై రాయితీ రుణాలు అందించి ప్రోత్సహిస్తామని తెలిపారు. ఎరువులు, వరి, పత్తి విత్తనాలు సరిపడా అందుబాటులో ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ పంట మార్పిడి విధానాన్ని అవలంబించి వాణిజ్యం, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవడం ద్వారా అధిక దిగుబడితోపాటు భూసారం పెంపొందుతుందని తెలిపారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ, మార్కెట్ కమిటీ అధికారులు, చైర్మన్ ప్రేమ్చంద్, అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రతినిధి సింగతి మురళి, బ్యాంకు అధికారులు, ఫర్టిలైజర్ షాపుల యజమానులు, రైతులు పాల్గొన్నారు.
భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ కు మార్ దీపక్ అన్నారు. మంగళవారం హాజీ పూర్ మండలం వేంపల్లి, పెద్దంపేట గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తుతోపాటు రిజిష్టర్డ్ దస్తావేజులు, రెవెన్యూ రికార్డులు జతపరిస్తే త్వరగా పరిష్కరించే అవకాశం ఉంటుందని అన్నారు. తహసీల్దార్ శ్రీనివాసరావుదేశ్పాండే, నాయబ్ తహసీల్దార్ అతీశ్, గిర్దావర్లు మంగ, ప్రభు పాల్గొన్నారు. అనంతరం దొనబండ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. తరగతి గదులు, వంటశాల పరిసరాలను పరిశీలించి పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలన్నారు.