
● నేటి నుంచి 17వరకు ప్రత్యేక కార్యక్రమాలు ● జిల్లా మహిళ
కార్యక్రమాలు ఇలా...
● 10న అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, తల్లిదండ్రుల గ్రూప్ సెల్ఫీ, గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు, మహిళా స్వయం సహాయక సంఘాలతో సమావేశం నిర్వహిస్తారు.
● 11న మూడేళ్లు పైబడిన చిన్నారుల నివాసాలను సందర్శించి అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న సేవలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, పిల్లలను చేర్చేలా ప్రోత్సహించడం చేపడుతారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు దాటిన పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి ప్రైమరీ స్కూళ్లలో చేర్పిస్తారు.
● 12, 13, 16న పోషణ కిచెన్ గార్డెన్, పోషకాహార వివరాలను వివరిస్తూ స్టడీ మెటీరియల్ పంపిణీ చేయాలి. చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణం అంగన్వాడీ కేంద్రాల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
● 17న అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిదండ్రులు, గ్రామపెద్దల సమక్షంలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించాలి.
మంచిర్యాలలో అమ్మమాట–అంగన్వాడీ బాట ర్యాలీ నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లు(ఫైల్)
మంచిర్యాలటౌన్: అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గత ఏడాది నుంచి వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రవేశాలను పెంచే కార్యక్రమంలో భాగంగానే గత ఏడాది నుంచి ‘అమ్మ మాట–అంగన్వాడీ బాట’ పేరిట విద్యాసంవత్స రం ఆరంభంలోనే పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నెల 10 నుంచి 17వరకు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ‘అమ్మ మాట–అంగన్వాడీ బాట’ కార్యక్రమాల నిర్వహణకు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేసింది. మూడేళ్ల చిన్నారులు తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాల్లో చేరేలా, ఐదేళ్లు దాటిన వారిని దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు.
పౌష్టికాహారం, విద్య
జిల్లాలో 969 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 3నుంచి 6ఏళ్ల వయస్సు గల పిల్లలు 17,891 మంది ఉన్నారు. వీరిలో 5–6ఏళ్లలోపు చిన్నారులు 2,579మంది ఉన్నారు. ఐదేళ్లు పూర్తయిన వారిని పాఠశాలల్లో చేర్పిస్తే చిన్నారుల సంఖ్య తగ్గుతుంది. దీంతో మూడేళ్లు దాటిన పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకుని వారిని అంగన్వాడీ కేంద్రాలకు తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. కేంద్రానికి వచ్చే చిన్నారులకు భోజనం, గుడ్డు, మురుకులు అందజేస్తున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు కేంద్రాల్లోనే ఉండి పూర్వ ప్రాథమిక విద్య అభ్యసిస్తున్నారు. ఆటపాటలు, కథలతోపాటు సంభాషణ నైపుణ్యాలు నేర్పించి చిన్ననాటి నుంచే మంచి అలవాట్లు అలవర్చుకునేలా సంసిద్ధం చేస్తున్నారు. ఆరేళ్ల వరకు పూర్వప్రాథమిక విద్యను అందిస్తూ.. ఆ తర్వాత నేరుగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేలా కార్యక్రమాలు చేపడుతారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకునేలా అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి వివరిస్తారు. రెండున్నరేళ్లు పూర్తయిన చిన్నారులను గుర్తించి అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు.
ఖాళీలతో సతమతం
జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట, మంచిర్యాల ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 969 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 907 మంది టీచర్లు, 716 మంది ఆయాలు పని చేస్తున్నారు. 62 టీచర్, 253 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలను పక్కనే ఉండే మరో కేంద్రానికి చెందిన టీచర్లు, ఆయాలతో నిర్వహిస్తున్నారు. దీంతో రెండు కేంద్రాల పర్యవేక్షణ టీచర్లకు కష్టంగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల బలోపేతం కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నా ఖాళీలను భర్తీ చేస్తేనే లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో సేవలు అందే అవకాశం ఉంది. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఖాళీలు భర్తీ చేస్తే చిన్నారులను చేర్చేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చే అవకాశం ఉంది.
చిన్నారులను చేర్పించేలా
జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మూడేళ్లు దాటిన చిన్నారులను చేర్పించేందుకు అమ్మమాట–అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. ఐదేళ్లు దాటిన చిన్నారులను దగ్గరలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించడం, చిన్నారులకు అందించే పౌష్టికాహారం, పూర్వపు ప్రాథమిక విద్యపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది.
– రౌఫ్ఖాన్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి