పొట్టకూటి కోసం వెళ్లి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

పొట్టకూటి కోసం వెళ్లి అదృశ్యం

Jun 10 2025 3:28 AM | Updated on Jun 10 2025 3:28 AM

పొట్టకూటి కోసం వెళ్లి అదృశ్యం

పొట్టకూటి కోసం వెళ్లి అదృశ్యం

● గల్ఫ్‌దేశంలో జాడ తెలియని నిర్మల్‌ జిల్లావాసి ● ఆందోళనలో కుటుంబసభ్యులు ● ఇండియాకు రప్పించాలని వినతి

నిర్మల్‌ఖిల్లా: పొట్టకూటి కోసం గల్ఫ్‌ దేశానికి వెళ్లిన జిల్లాకు చెందిన ఓ కార్మికుడి ఆచూకీ తెలియక అతడి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్‌కు చెందిన పన్నాల శ్రీనివాస్‌(40) గత 16 సంవత్సరాలుగా సౌదీ అరేబియాలో తోటమాలిగా పనిచేస్తున్నాడు. ప్రతీ రెండూ, మూడేళ్లకొకసారి ఇంటికి వస్తూ పోతుండేవాడు. ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. తాజాగా ఎనిమిది నెలల క్రితం ఇంటికి తిరిగి వచ్చిన శ్రీనివాస్‌ ఇక ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే సౌదీ అరేబియాలోని తన యజమాని వచ్చి పనిలో చేరాలని కోరగా గత మే నెలలో మళ్లీ వెళ్లాడు. అక్కడ యజమాని ఇంట్లో రెండు రోజులు ఉన్న అనంతరం వ్యవసాయ క్షేత్రానికి పంపగా అక్కడి నుంచి తన భార్యాపిల్లలకు ఫోన్‌ చేసి క్షేమ సమాచారం అందించాడు. అనంతరం అతని నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అక్కడి యజమానికి ఫోన్‌ చేయగా స్పందించలేదని, శ్రీనివాస్‌ క్షేమసమాచారంపై తమకు ఆందోళనగా ఉందని సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో శ్రీనివాస్‌ తల్లి గంగవ్వ, భార్య మమత, ముగ్గురు పిల్లలు వాపోయారు. సౌదీ అరేబియా నుంచి స్వస్థలానికి రప్పించే ఏర్పాటు చేయాలని వేడుకున్నారు. అనంతరం రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ అడ్వైజరీ కమిటీ సభ్యుడు స్వదేశ్‌ పరికిపండ్లను కలిసి పూర్తి వివరాలు అందజేశారు. అక్కడి ఎంబసీతో మాట్లాడి శ్రీనివాస్‌ ఆచూకీ గుర్తించే ప్రయత్నం చేస్తామని కుటుంబసభ్యులకు ఆయన భరోసానిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement