మహబూబ్నగర్ క్రైం: ప్రజల భద్రత కోసం నిరంతరం విధుల్లో ఉండే పోలీసులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాల్సిన అవస రం ఉందని ఎస్పీ డి.జానకి అన్నారు. విధుల్లో ఎదురయ్యే ఒత్తిళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే అత్యవసర పరిస్థితుల్లో స్వీయ రక్షణ చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. పోలీస్ సిబ్బంది శారీరక, మానసిక సామర్థ్యాలను మరింత మెరుగుపర్చే ఉద్దేశంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పరేడ్ మైదానంలో పోలీస్ సిబ్బందికి ఏర్పాటు చేసిన 45 రోజుల కరాటే శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీస్ విధుల్లో స్వీయ రక్షణతో పాటు శారీరక, మానసిక దృఢత్వం ఎంతో ముఖ్యమన్నారు. కరాటే శిక్షణ కేవలం ఆత్మరక్షణకు మాత్రమే పరిమితం కాదని, మానసిక ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణను పెంపొందించడంలోనూ ఉపయోగపడుతుందని తెలిపారు. పోలీసులు విధి నిర్వహణలో ఉండే ఒత్తిళ్లను అధిగమించేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని సూచించారు. శారీరక దారుఢ్యం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా వంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే ప్రజల భద్రత కోసం పోలీసులు కీలకపాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్కుమార్, డీఎస్పీ రమణారెడ్డి, ఆర్ఐలు కృష్ణయ్య, నగేష్, వన్టౌన్ ఎస్ఐ వసంత పాల్గొన్నారు.
ఉదండాపూర్కు
పర్యాటక శోభ
జడ్చర్ల: ఉదండాపూర్ రిజర్వాయర్ను పర్యాటక కేంద్రంగా గుర్తించేందుకు ప్రణాళికలను రూపొందించి అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మార్చి 26న అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తర సమయంలో కోరారు. తాజాగా స్పందించిన ప్రభుత్వం సోమశిల–అలంపూర్ ప్రత్యేక పర్యాటక ప్రాంతం(ఎస్టీఏ)లో భాగంగా ఉదండాపూర్ను చేరుస్తూ పర్యాటక, సాంస్కృతిక శాఖ, ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి సమగ్ర మాస్టర్ప్లాన్ తయారీకి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం తమ విజ్ఞప్తి మేరకు ఉత్తర్వులు జారీ చేయడంపై ఎమ్మెల్యే శనివారం ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.


