మహమ్మదాబాద్/గండేడ్: అటవీ ప్రాంతంలోని ఖాళీస్థలాల్లో ఫలాలనిచ్చే మొక్కలు నాటితే చాలా మంచిదని జోగుళాంబ సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ పారెస్ట్ అధికారి శివాల రాంబాబు తెలిపారు. మంగళవారం ఆయన మహమ్మదాబాద్ రేంజ్ పరిధిలోని జూలపల్లి అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గతంలో నాటిన మొక్కలు ఎలా ఉన్నాయి.. ఏ రకమైన మొక్కలు ఉన్నాయి.. మంచి ఫలాలనిచ్చే మొక్కలు నాటారా అన్న కోణంలో పరిశీలించారు. రెండు సంవత్సరాల క్రితం నాటిన మొక్కలు ఏపుగా ఎదగడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం కూడా ఇలాంటి ప్లాంటేషన్ చేయాలని సూచించారు. కాగా అటవీ ప్రాంతంలో గతంలో లక్షలు ఖర్చుచేసి నాటిన మొక్కలు పాడవకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. ఏపుగా పెరిగిన మొక్కలను అనుమతులు లేకుండా తీసి వేయరాదని అలాంటి పొరపాట్లు అటవీశాఖ అధికారులు చేయరాదని సూచించారు. ముఖ్యంగా నర్సరీల్లో మొక్కలు ఆరోగ్యంగా పెరిగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ, ఫ్లయింగ్ స్క్వాడ్ గణేష్, మహమ్మదాబాద్ రేంజ్ అధికారి అబ్దుల్హై, డిప్యూటీ రేంజ్ అధికారి రాఘవేందర్, ఉదయ్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


