
పండ్ల దుకాణాలు తొలగిస్తే ఊరుకోం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): బస్టాండ్ ముందున్న పండ్ల దుకాణాలను తొలగిస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. బస్టాండ్ ముందున్న పండ్ల దుకాణాలను తొలగించాలని ఆర్టీసీ అధికారులు ఆదేశాలతో ఆందోళన జరిగిన నేపథ్యంలో ఆదివారం ఆయన పండ్ల వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. రోడ్డుపై దుకాణాలు పెట్టుకుని జీవిస్తున్న వారికిపై ఆర్టీసీ అధికారుల దౌర్జన్యం ఏమిటని ప్రశ్నించారు. బస్టాండ్ను ఆసరాగా చేసుకుని నిరుపేదలు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుని జీవిస్తుంటారన్నారు. బస్టాండ్ను ఆసరా చేసుకుని వ్యాపారం చేసుకునే పండ్ల వ్యాపారులను శ్రీనివాసకాలనీకి తరలిస్తే ఎట్లా అని ప్రశ్నించారు. తాతముత్తాతల నుంచి ఇక్కడే పండ్లు అమ్ముకుని తమ కుటుంబాలను పోషించుకున్న వాళ్లను ఉన్నఫలంగా తొలగిస్తామడం సరికాదన్నారు. పండ్ల వ్యాపారం చేసుకున్న వారికోసం తమ హయాంలో 80 దుకాణాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. పండ్ల వ్యాపారులను అక్కడి నుంచి తరలించే ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పండ్ల దుకాణాలు ఎలా తీస్తారో చూస్తాం.. ఆర్టీసీ డిపో కూడా పెద్దచెరువు ఎఫ్టీఎల్లో ఉందన్నారు. ఆర్టీసీకి ఓ నిబంధన.. పండ్ల వ్యాపారులకు ఓ నిబంధనా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నర్సింహులు, వెంకన్న, శివరాజు, రామ్లక్ష్మణ్, ఇమ్రాన్, ఆంజనేయులు, శ్రీనివాస్రెడ్డి, నవకాంత్, సత్యం తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్