● ఎస్పీ శబరీష్
మహబూబాబాద్ రూరల్: విద్యార్థుల ప్రాణ భద్రతపై ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని ఎస్పీ శబరీష్ స్పష్టం చేశారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పాఠశాలలు, కళాశాలల బస్సు డ్రైవర్లపై ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు సోమవారం నిర్వహించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లతో సమన్వయం చేసుకుని బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ల అర్హతలు, వాహనాల భద్రతా ప్రమాణాలను సమగ్రంగా పరిశీలించారు. తనిఖీల సందర్భంగా డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించి, మద్యం తాగి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే బస్సులకు సంబంధించిన అవసరమైన పత్రాలు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్, పర్మిట్ తదితర అంశాలను కూడా అధికారులు పరిశీలించారు. విద్యార్థులు ప్రయాణించే బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ సదుపాయాలు, అగ్నిమాపక పరికరాలు, ఇతర భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనం నడపడం ఒక తీవ్రమైన నేరమని, ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల బస్సుల డ్రైవర్లు మరింత బాధ్యతతో వ్యవహరించాలన్నారు. అన్ని విద్యాసంస్థలు తమ బస్సుల నిర్వహణ, డ్రైవర్ల ప్రవర్తన, భద్రతా ప్రమాణాలపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. తల్లిదండ్రులకు కూడా తమ పిల్లలు ప్రయాణించే వాహనాల పరిస్థితిపై అవగాహన ఉండాలని సూచించారు. విద్యార్థుల భద్రతను కాపాడడంలో భాగంగా జిల్లా పోలీసు శాఖ ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.


